అవును అని చెప్పను, కాదు అనను, వారికి వేధింపులుండవ్: మందగమనంపై నిర్మల
న్యూఢిల్లీ: భారత ఆర్షిక వ్యవస్థను పుంజుకునేలా చేసేందుకు మోడీ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం అన్నారు. హిందూస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్లో ఆమె పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆర్థిక మందగమన పరిస్థితులు నెలకొనడంతో మోడీ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్లో జీడీపీ 5 శాతంగా ఉండగా, రెండో క్వార్టర్లో ఏకంగా 4.5 శాతానికి తగ్గింది. ఈ నేపథ్యంలో ఆమె భారత ఎకానమీపై స్పందించారు. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు పన్నుల హేతుబద్దీకరణ సహా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
అవునని చెప్పను.. కాదని చెప్పను
ఆర్థిక వ్యవస్థను పుంజుకునేలా చేయడం కోసం మరిన్ని చర్యలు ఏవైనా తీసుకుంటున్నారా అనే ప్రశ్నకు నిర్మలా సీతారామన్ సమాధానం ఇస్తూ... ఇందుకు నేను అవును అని అంటే మీరు ఎప్పుడు అని అడుగుతారని, అందుకే అవునని చెప్పాలని ఉన్నప్పటికీ తాను చెప్పనని వ్యాఖ్యానించారు. అదే సమయంలో నేను లేదు అని కూడా చెప్పడం లేదని, ఎందుకంటే మరిన్ని చర్యలపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు.
జీడీపీ పురోగతికి...
కార్పోరేట్ పన్ను కోత నేపథ్యంలో వ్యక్తిగత ఆదాయపు పన్నును కూడా తగ్గించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయని, వీటిపై తాము ఆలోచిస్తున్నామని, చెప్పారు. జీడీపీ పురోగతికి కావాల్సిన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, వినియోగ సామర్థ్యం పెంచేందుకు, మార్కెట్లో రుణ లభ్యత పెరిగేందుకు తగిన నిర్ణయాలను అమలు పరుస్తున్నామన్నారు. మరిన్ని వృద్ధి సహాయక చర్యలు ఉంటాయా అనే ప్రశ్నకు ప్రత్యక్షంగా సమాధానం చెప్పనప్పటికీ పరోక్షంగా ఉండవచ్చునని సంకేతాలు ఇచ్చారు.
పన్ను చెల్లింపుదారులకు వేధింపులు ఉండవు
జీఎస్టీ రేట్లను జీఎస్టీ మండలి నిర్ణయిస్తుందని నిర్మలా సీతారామన్ అన్నారు. జీఎస్టీని కూడా హేతుబద్ధం చేస్తున్నామన్నారు. మొత్తం పన్ను వ్యవస్థనే సరళీకరిస్తున్నామని స్పష్టం చేశారు. పన్ను చెల్లింపుదారులపై ఎలాంటి వేధింపులు ఉండవని భరోసా ఇచ్చారు. డేటా యథార్ధతపై భయాలు నెలకొన్న నేపథ్యంలో అవేవీ అక్కర్లేదని, విశ్వసనీయతను పెంచే చర్యల్ని తీసుకుంటున్నట్లు తెలిపారు.
వినియోగ సామర్థ్యం పెంచుతున్నాం
ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుగు ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో మోడీ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. గ్రామాల్లో వినియోగం పెంచేందుకు గత రెండు నెలల్లో ప్రభుత్వరంగ బ్యాంకులు రూ.5 లక్షల కోట్ల వరకు పంపిణీ చేశాయన్నారు. డిమాండ్ పుంజుకునేలా చేయడం కోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా మౌలిక రంగంలో వ్యయాలు చేయడం ద్వారా చర్యలు చేపడుతున్నామన్నారు. మౌలిక రంగంలో పెట్టుబడుల ద్వారా శ్రామిక శక్తికి ఉపాధి అవకాశాలు పెంచుతున్నామని తద్వారా వినియోగ సామర్థ్యాన్ని పెంచుతున్నామన్నారు. ప్రజల చేతుల్లో మరింత ద్రవ్యం ఉంటే మార్కెట్లో వినియోగ సామర్థ్యం క్రమేణా పుంజుకుంటుందని కేంద్రం ఆలోచిస్తోంది. అలాగే ఆదాయపు పన్ను తగ్గించడం వల్ల ప్రజల వినియోగ శక్తి పెరిగి, ప్రయివేటు పెట్టుబడులు పెరిగేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.