న్యూఢిల్లీ: జీఎస్టీ, నోట్ల రద్దు వల్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల (MSME) కార్యకలాపాల్లో పారదర్శకత పెరిగిందని, దీంతో వాటికి బ్యాంకులు అధికంగా రుణాలు ఇచ్చే సానుకూలత పెరిగిందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ ఫిక్కీ కార్యక్రమంలో అన్నారు. MSME సంస్థలకు బ్యాంకింగ్ సేవల విషయంలో ఎస్బీఐ పూర్తిగా చేయూతను ఇస్తోందన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల ప్రస్తుతానికి కొంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నప్పటికీ MSMEలకు మాత్రం ఉపకరించాయన్నారు.
ఐబీసీ, ఎన్సీఎల్టీ వ్యవస్థ ఏర్పాటుతో బాకీల సమస్య త్వరగా పరిష్కరించే అవకాశం ఏర్పడిందన్నారు. బ్యాంకింగ్ రంగానికి సంబంధించినంత వరకు ఇది సానుకూల అంశమని చెప్పారు.

ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనం సరైన దిశగా తీసుకున్న నిర్ణయమని చెప్పారు. భిన్నత్వం లేకుండా ఒకే తరహా సేవలు అందించేందుకు ఇన్ని బ్యాంకులు ఎందుకని, కనీసం కొన్నింటిని విలీనం చేస్తే సమర్థత పెరుగుతుందని, పరిపాలనా వ్యయాలు కూడా తగ్గుతాయని చెప్పారు. ఎస్బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనం, కుటుంబ వ్యవహారం లాంటిదని, కాబట్టి ఇది సులువుగా సాగిందని చెప్పారు. ఇతర బ్యాంకుల విషయంలో అలా ఉండకపోవచ్చునన్నారు.
దేశాన్ని మందగమనం నుంచి బయటకు తీసుకు వచ్చేందుకు కేంద్రం వెంటనే మరిన్ని చర్యలు చేపట్టాలని ఫిక్కీ జాతీయ అధ్యక్షురాలు సంగీతా రెడ్డి అన్నారు. ఆర్థిక స్థితిగతులకు సంబంధించి ఏడాది క్రితం ఉన్న ఉత్సాహం ఇప్పుడు లేదన్నారు. మూలధన సమీకరణ క్షీణించిందని, వినియోగం తగ్గిందన్నారు. మరిన్ని ఉద్దీపన ప్యాకేజీలు అవసరమన్నారు. వినియోగాన్ని పెంపొందించేందుకు ఆర్థిక వ్యవస్థలోకి రూ.1 లక్ష కోట్ల నుంచి రూ.2 లక్షల కోట్ల వరకు నిధులు తక్షణం తీసుకు రావాలన్నారు.


Click it and Unblock the Notifications