ఆదాయపుపన్ను మినహాయింపుల ఎత్తివేత: ఎందుకో చెప్పిన నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: వ్యక్తిగత ఆదాయపుపన్ను మినహాయింపులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆమె సాయంత్రం మీడియాతో మాట్లాడారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం తాము అన్ని ఆదాయపుపన్ను మినహాయింపులు తొలగించామని స్పష్టం చేశారు.
గత సెప్టెంబర్లో కార్పొరేట్ పన్ను తగ్గించిన విధంగానే ఇప్పుడు వ్యక్తిగత ఆదాయపుపన్ను తగ్గించామని కేంద్రమంత్రి తెలిపారు. అవసరమైన సందర్భాల్లో పబ్లిక్ సెక్టార్లోని బ్యాంకులకు అదనపు మూలధనం అందజేయడం జరుగుతుందని ఆమె చెప్పారు.
అయితే, అదనపు మూలధనం ఎంత అనేది మాత్రం నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించకపోవడం గమనార్హం. ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారా ప్రస్తుతం ఉన్న జీడీపీ ద్రవ్యలోటు 3.8శాతాన్ని వచ్చే ఏడాదికి 3.5శాతానికి తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
ఎవరైతే మినహాయింపులు కావాలనుకుంటారో వారంతా పాత రేట్లను ఉపయోగించుకోవచ్చని అన్నారు. తగ్గింపు రేట్లను కావాలనుకునేవారు కొత్త రేట్లను ఎంచుకోవచ్చని కేంద్రమంత్రి సూచించారు. ఆదాయపుపన్ను విధానాన్ని సరళీకరించేందుకే రేట్లను తగ్గించామని తెలిపారు. ఎవరైతే తమ చేతులోకి ఆదాయం ఎక్కువగా రావాలనుకుంటారో వారు వారికి అనుకూలమైన రేట్లను ఎంచుకునే వెసులుబాటు కల్పించామని నిర్మలా సీతారామన్ తెలిపారు.
రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ మార్పు, పదవీ విరమణ సమయంలో లీవ్ ఎన్క్యాస్మెంట్ చేసుకోవడం, వీఆర్ఎస్ కింద రూ. 5లక్షల వరకు, ఈపీఎఫ్ఓలో ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్, ఎన్పీఎస్పై పొందిన చెల్లింపులు, అలాగే ఉంచబడిన అవార్డు చెల్లింపులపై మినహాయింపులు ఉన్నాయని రెవెన్యూ సెక్రటరీ అజయ్ భూషణ్ పాండే వివరించారు.