ఏడాదిలో 15,000 బ్రాంచీలు తెరవండి: బ్యాంకులకు ప్రభుత్వం ఆదేశం!
గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త. ఇకపై మీరు బ్యాంకు శాఖ కు వెళ్లాలంటే చాలా దూరం ప్రయాణించాల్సిన అవసరం లేదు. మీకు దగ్గరలోనే ఒక బ్యాంకు శాఖ కొత్తగా ఏర్పాటు కాబోతోంది. అవునండీ... దేశంలో, ముఖ్యంగా బ్యాంకు కార్యకలాపాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో ప్రతి 15 కిలోమీటర్ల పరిధిలో ఒక బ్యాంకు శాఖ తప్పనిసరిగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందరికి బ్యాంకింగ్ సదుపాయం కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అటు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇటు ప్రైవేట్ రంగ బ్యాంకులకు కూడా ఆదేశాలు జారీ చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ సరిపోను బ్యాంకు శాఖలు ఉంది తీరాల్సిందేనని తన ఆదేశాల్లో పేర్కొంది. వీలైనంత త్వరగా ఆయా ప్రాంతాలను గుర్తించి, అక్కడ బ్యాంకు శాఖలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కోరింది. దీనిపై ది ఎకనామిక్ టైమ్స్ ఒక ప్రత్యక కథనాన్ని ప్రచురించింది. ప్రభుత్వ ఉన్నతాధికారులను ఉటంకిస్తూ ఈ విషయాన్నిఈటీ వెల్లడించింది.
కరెన్సీపై లక్ష్మీదేవి చిత్రం ఉంటే.. రూపాయి బలపడుతుందా?
15,000 కొత్త బ్రాంచీలు...
దేశం మొత్తం మీద వచ్చే ఆర్థిక సంవత్సరం లో కొత్తగా 15,000 బ్యాంకు శాఖలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వ రంగ బ్యాంకులైన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), బ్యాంకు ఆఫ్ బరోడా (బీఓబీ) లతో పాటుగా ప్రైవేట్ రంగంలోని అతి పెద్ద బ్యాంకులు ఐన ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సి బ్యాంకులను కోరింది. ప్రతి గ్రామానికి 15 కిలోమీటర్ల పరిధిలో బ్యాంకు శాఖ లేనట్లయితే... అక్కడ వెంటనే ఒక కొత్త బ్యాంకు శాఖను ఏర్పాటు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ సూచించింది. ఈ మేరకు ఎక్కడెక్కడ కొత్త శాఖలు ఏర్పాటు చేయవచ్చొ కూడా ఆర్థిక శాఖ వెల్లడించింది. గ్రామాల పేర్లతో కూడిన జాబితాను కూడా తన ఆదేశాలతో పాటు సదరు బ్యాంకులకు అందించినట్లు సమాచారం.
ఎస్బీ ఐ ఒక్కటే 1,500 శాఖలు..
ఈ ప్రణాళికలో భాగంగా దేశంలోనే అతి పెద్ద బ్యాంకు ఐన ఎస్బీ ఐ కి ఆర్థిక శాఖ పెద్ద బాధ్యతను అప్పగించింది. మొత్తం 15,000 బ్రాంచీలకు గాను అందులో 10% అంటే... 1,500 శాఖలను ఒక్క స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా నే ఏర్పాటు చేయాలని సూచించింది. అదే సమయంలో మిగితా బ్యాంకులు ఒక్కోటి సుమారు 600 నుంచి 700 శాఖలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2019 మార్చి నాటికి దేశంలో మొత్తం 1,20,000 బ్యాంకు శాఖలు, సుమారు 2,00,000 ఏటీఎం లు ఉన్నాయి. కానీ ఇందులో కేవలం 35,649 శాఖలు మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో ఉండటం గమనార్హం.
అదే అసలు కారణం...
ప్రభుత్వ రంగ బ్యాంకు అయినా.. ప్రైవేటు బ్యాంకు అయినా... పట్టణాలు, నగరాల్లోనే తమ శాఖలను అధికంగా ఏర్పాటు చేస్తాయి. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే బ్యాంకు శాఖ రెండేళ్లలోనే లాభాల్లోకి వస్తుంది. అదే గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకు శాఖలు లాభాల బాట పట్టాలంటే కనీసం 4 ఏళ్ళు పడుతుంది. అందుకే అటువైపు వెళ్లేందుకు ఏ బ్యాంకులు కూడా సిద్దపడవు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు కూడా బ్యాంకులను చేరువ చేసి, వారికి తక్కువ వడ్డీలకే రుణాలు దొరికే అవకాశాలను కల్పించాలని కోరుకుంటోంది. తద్వారా గ్రామాల్లో అధిక వడ్డీలు వసూలు చేసే వడ్డీ వ్యాపారులకు చెక్ పెట్టవచ్చని భావిస్తోంది. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో కొత్త శాఖలు ఏర్పాటు చేసేందుకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కూడా నిబంధనలు సడలించింది. మైక్రో బ్రాంచ్ ఏర్పాటుకు తమ అనుమతి కూడా అక్కరలేదని స్పష్టం చేసింది. దీంతో బ్యాంకులు గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 4-5 గంటలు పనిచేసేలా చిన్న శాఖల ఏర్పాటుకు మొగ్గు చూపవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు.