మధ్యతరగతి, చిరు వ్యాపారుల కోసం... మరో విడత ఆర్థిక ప్యాకేజీ
కరోనా మహమ్మారి, లాక్ డౌన్ నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ పతనమైంది. 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం ఏప్రిల్-జూన్లో జీడీపీ ఏకంగా 23.9 శాతం మేర క్షీణించింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూ.21 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. మరో విడత ప్యాకేజీ సెప్టెంబర్లో ఉంటుందని గతంలోనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా అనారోగ్యకర ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలు ఎక్కించేందుకు మరో విడత ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. మరో విడత ఆర్థిక ప్యాకేజీ అవసరమని ఆర్థిక నిపుణులు కూడా భావిస్తున్నారు.
అమెరికా కంటే దారుణం, భవిష్యత్తు కోసం దాచుకోవద్దు: ప్రభుత్వంపై రఘురాం రాజన్
మధ్య తరగతి, చిన్న వ్యాపారాలు
గత ఆర్థిక ప్యాకేజీ ప్రధానంగా ఎంఎస్ఎంఈలు, వీధి వ్యాపారులు సహా వివిధ వర్గాలకు వెసులుబాటు కల్పించారు. ఈసారి మధ్య తరగతి కుటుంబాలు, చిన్న వ్యాపారాలపై దృష్టి సారించనున్నారని తెలుస్తోంది. మరో విడత ఉద్దీపన ప్యాకేజీని సాధ్యమైనంత త్వరలో ఆశించవచ్చునని చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి వి సుబ్రమణియన్ అన్నారు. ఇప్పుడు లాక్ డౌన్ ముగిసింది. ఆర్థిక కార్యకలాపాలు తిరిగి కోలుకుంటున్నాయి. చాలా రాష్ట్రాల్లో తిరిగి వ్యాపారాలు, సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉద్దీపన ప్యాకేజీ ప్రయోజకరంగా ఉంటుందని భావిస్తున్నారు.
ప్రపంచంలోనే అత్యంత దారుణ పతనం
ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంలో భాగంగా ఉద్దీపన ప్యాకేజీ అంశానికి సంబంధించి ఆర్థికమంత్రిత్వ శాఖ కీలక ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహిస్తోందని తెలుస్తోంది. గత రెండు నెలలుగా సమావేశాలు జరుగుతున్నాయి. క్వార్టర్ జీడీపీ రికార్డ్ స్థాయి పతనం కావడంతో ఉద్దీపన ప్యాకేజీపై కసరత్తు వేగవంతం చేశారని తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది. నిపుణుల అంచనా మేరకు ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి ఏడాది జీడీపీ 7 శాతం నుండి 9.5 శాతం మేర ప్రతికూలత నమోదు చేస్తుందని అంచనా.
ప్రత్యక్షంగా ఆర్థిక ఊతం..
డిమాండ్ పెంచే చర్యలు ఈ ఆర్థిక ప్యాకేజీలోను ఉండనున్నాయి. ప్రస్తుతం డిమాండ్ క్షీణత అతి పెద్ద సవాల్గా మారింది. ఈ నేపథ్యంలో ఈ దిశగా మరోసారి ప్యాకేజీ ఉండనుంది. అలాగే, ఈ ప్యాకేజీకి చిన్న వ్యాపారాలకు, మధ్యతరగతికి ఊతమిచ్చేదిలా ఉండనుంది. ఈ ప్యాకేజీ పరిమాణంపై కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. నీతి అయోగ్, పీఎం ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్, ఫైనాన్స్ మినిస్ట్రీ.. అన్నీ కూడా మధ్య తరగతి వారికి ఊతమివ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాయి. ఆర్థిక వ్యవస్థ ఎన్నడూ లేని రీతిలో సమస్యలు ఎదుర్కొంటున్నందున ప్రత్యక్షంగా ఊతమిచ్చే చర్యలు చేపట్టాలని ఆర్థికవేత్తలు కూడా కోరుతున్నారు.