గుడ్న్యూస్: కరోనా పై పోరాటానికి బెయిల్ అవుట్ ప్యాకేజీ!
కరోనా వైరస్. ఈ పేరు చెబితేనే ప్రస్తుతం ప్రపంచం చిగురుటాకులా వణికిపోతోంది. ఏ నోట విన్నా... ఏ చోటాకెళ్లినా అందరూ చర్చించుకునే ఒకే ఒక్క అంశం కరోనా. ఈ మహమ్మారి బారిన పడిన సుమారు 170 దేశాలు ఇప్పటికే 8,000 ప్రజల ప్రాణాలను కోల్పోయాయి. సుమారు 2 లక్షల మంది ప్రజలు ఈ ప్రాణాంతక వైరస్ తో పోరాటం చేస్తున్నారు. చైనా లో మొదలైన కరోనా ముసలం అభివృద్ధి చెందిన దేశాలను కూడా వదలలేదు. ఒకరకంగా చెప్పాలంటే అక్కడే అధిక ప్రాణ నష్టం జరుగుతోంది. ఇటలీ లో కేవలం 15 రోజుల క్రితమే కనిపించిన కరోనా వైరస్... ఇప్పటికే 3,000 కు పైగా ప్రజల ప్రాణాలను బలిగొంది. ఈ సంఖ్య చైనా లో కరోనా తో మరణించిన వారితో సమానం కావటం గమనార్హం. ఇటీవలే మన దేశానికి కూడా వచ్చిన కరోనా వైరస్... ఇక్కడ కూడా సుమారు 200 మందికి సోకి, 4 ప్రాణాలను బలి తీసుకుంది. ఇండియాలో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ దీని ఉనికి కనిపిస్తోంది. ఈ దెబ్బకు దేశంలోని అన్ని రాష్ట్రాలు హై అలెర్ట్ ప్రకటించాయి. జనం అధికంగా గుమికూడే అన్ని రకాల ప్రదేశాలను మార్చి 31 వరకు మూసేయాలని నిర్ణయించాయి. దీంతో స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు, మాల్స్, సినిమా హాళ్లు, బార్లు మూతపడ్డాయి.
వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా?: జియో, బీఎస్ఎన్ఎల్ సూపర్ ఆఫర్
టాస్క్ ఫోర్స్ ఏర్పాటు...
దేశంలో షట్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో అన్ని రంగాలు దెబ్బతింటున్నాయి. పర్యాటకం, ట్రావెల్, ఏవియేషన్, ఆతిథ్యం, ఎగుమతులు, దిగుమతులు ఇలా అన్ని రంగాలు ప్రభావితం అవుతున్నాయి. అందుకే, కరోనా పై ధీటుగా పోరాటం చేసేందుకు, అన్ని రంగాలు కరోనా ప్రభావం నుంచి బయటపడి సాధారణ స్థితికి చేరుకునేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నేతృత్వంలో ఈ టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది. ఇప్పటికే ఆర్థిక మంత్రి వివిధ శాఖల మంత్రులతో పలు దఫాలుగా భేటీ అయి చర్చలు జరిపారు. ఇందులో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ తో పాటు, పశు సంవర్థక శాఖ, టూరిజం, పౌర విమానయాన మంత్రిత్వ శాఖల మంత్రులు పాల్గొన్నారు.
ప్యాకేజీ పై నేడు చర్చ...
కరోనా తో తీవ్రంగా దెబ్బతిన్న పలు రంగాలను మళ్ళీ గాడిన పడేసేలా కేంద్రం పలు చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా ఆయా రంగాలకు ఆర్థికంగా చేయూతనిచ్చేలా ప్రత్యేక బెయిల్ అవుట్ ప్యాకేజీ ని రూపొందిస్తున్నారు. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఆధ్వర్యంలో నేడు (శుక్రవారం) కీలక సమావేశం జరగబోతోంది. ఈ సందర్భంగా బెయిల్ అవుట్ ప్యాకేజీ విధివిధానాలు ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రముఖ వార్తా ఏజెన్సీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) ఒక కథనాన్ని ప్రచురించింది. ఇటీవల జాతిని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ... కూడా కరోనా పై యుద్ధం చేసేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దానికి నిర్మల సీతారామన్ నేతృత్వం వహిస్తారని చెప్పారు.
ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు...
ఇప్పటికే ఆర్థిక మందగమనం తో ఇండియన్ ఎకానమీ ఇబ్బంది పడుతోంది. అమెరికా - చైనా ల మధ్య జరిగిన వాణిజ్య యుద్ధం కూడా భారత్ తో పాటు ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. దాంతో దాదాపు ఏడాదికిపైగా భారత ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతోంది. ఉపాధి అవకాశాలు తగ్గి జనం ఇబ్బంది పడుతున్నారు. దేశ జీడీపీ వృద్ధి రేటు 4% కంటే లోపునకు పడిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ కరోనా రూపంలో భారత ఆర్థిక వ్యవస్థపై మరో పెను భారం పడుతోంది. అందుకే, ఈ పరిస్థితుల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడి, దానికి జవసత్వాలను నింపేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగానే ఆర్థిక ప్యాకేజీ ఆలోచనతో కేంద్రం ఒక ముందడుగు వేసింది.