3 నెలలు పీఎఫ్ మేమే చెల్లిస్తాం: PFపై మోడీ ప్రభుత్వం గుడ్న్యూస్, కండిషన్స్ అప్లై
కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇండియా లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం భారీ ప్యాకేజీని ప్రకటించింది. రూ.1.70 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఈ మొత్తాన్ని ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ స్కీం పేరుతో అందిస్తోంది. వలస కార్మికులు, పేదలు, గ్రామీణ పేదలను ఆదుకునేలా దీనిని రూపొందించారు. శానిటేషన్ వర్కర్లు, ఆశా వర్కర్లు, పారామెడికల్ సిబ్బంది, వైద్యులు, నర్సులకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల ఇన్సురెన్స్ కల్పిస్తున్నారు.
మహిళలకు 3 నెలలు ఉచిత గ్యాస్ సిలిండర్, జన్ ధన్ అకౌంట్లో డబ్బులు
ఈపీఎఫ్ శుభవార్త.. కండిషన్స్ అప్లై
మోడీ ప్రభుత్వం పీఎఫ్ విషయంలో శుభవార్త తెలిపింది. నెలకు రూ.15,000 కంటే తక్కువ వేతనం ఉన్న వారికి 24 శాతం ఈపీఎఫ్ను కేంద్రమే భరిస్తుంది. దీనిని మూడు నెలల పాటు ఇస్తుంది. ఉద్యోగి వాటాను, యజమాని వాటాను మొత్తం కలిపి ప్రభుత్వమే జమ చేస్తుంది. అయితే 100 మంది లోపు ఉన్న ఉద్యోగులు ఉన్న సంస్థలకు ఇది వర్తిస్తుంది. అంతేకాదు, ఇందులో 90 శాతం మంది ఉద్యోగులకు రూ.15,000 లోపు వేతనం ఉండాలి. అలాగే అత్యవసరమైతే ఈఫీఎఫ్ సబ్స్క్రైబర్లు 75 శాతం మొత్తాన్ని తీసుకోవచ్చు.
పూచీకత్తు లేకుండా రుణాలు
రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని రెండు విధాలుగా అందించనున్నట్లు నిర్మల ప్రకటించారు. పేదలకు ఆహారం లేకుండా ఉండే పరిస్థితి రానీయకుండా బియ్యం లేదా గోదుమలు రూపంలో, అలాగే మరికొంత మొత్తాన్ని ప్రత్యక్ష నగదు బదలీ ద్వారా చేయనున్నట్లు తెలిపారు. స్వయం సహాయక బృందాల రుణ పరిమితి రూ.10 లక్షలకు పెంపుతో పాటు పూచీకత్తు లేకుండా రుణాలు ఇస్తారు.
ఉపాధి హామీ వేతనాలు రూ.202కు పెంపు
ఉపాధి హామీ వేతనాలు రూ.182 నుండి రూ.202కు పెంచారు. ఉజ్వల పథకం కింద లబ్ధిదారులకు ఉచితంగా నెలకు ఒకటి చొప్పున మూడు నెలలు గ్యాస్ సిలిండర్లు. భవన నిర్మాణ కార్మికుల కోసం రాష్ట్రాలకు రూ.30వేల కోట్లు ఉపయోగించుకునే వెసులుబాటు ఇచ్చింది కేంద్రం.