కరోనా-లాక్డౌన్పై నిర్మల సీతారామన్ కీలక వ్యాఖ్య, మార్కెట్పై ప్రభావం
దేశంలో కరోనా మహమ్మారి కేసులు వేగంగా పెరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా కూడా లాక్ డౌన్ అవకాశాలు కొట్టి పారేయలేమని కొంతమంది ఆందోళన చెందుతున్నారు. కరోనా సెకండ్ వేవ్, దీనికి తోడు వివిధ ప్రాంతాల్లో లాక్ డౌన్ ఆందోళనల నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లు ఇటీవల భారీగా పతనమయ్యాయి. అదే సమయంలో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఊరట ప్రకటన చేశారు.
వరుసగా 4వ ఏడాది: మారుతీ దూకుడు, అత్యధికంగా అమ్మడైన 5 కార్లు ఇవే
మార్కెట్ పైన ప్రభావం
నేడు అంబేడ్కర్ జయంతి సందర్భంగా స్టాక్ మార్కెట్లు క్లోజ్. తాజా నిర్మల వ్యాఖ్యలతో రేపు మార్కెట్లు జంప్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇటీవల రోజుకు లక్షకు పైగా కేసులు నమోదైన సందర్భాలు ఉన్నాయి. దీనికి తోడు మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో లాక్ డౌన్ ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ గత వారం భారీగా క్షీణించాయి. నవంబర్ నుండి అంతకంతకూ ఎగిసి 52వేలను క్రాస్ చేసిన సెన్సెక్స్, కరోనా సెకండ్ వేవ్ భయంతో సోమవారం మార్కెట్లు 48వేల దిగువకు పతనమయ్యాయి. నిన్న ప్రభుత్వం నిర్ణయంతో 48,544 పాయింట్ల వద్ద ముగిసింది. అయినప్పటికీ ఆల్ టైమ్ గరిష్టంతో 3500 పాయింట్ల వరకు తక్కువగా ఉంది.
నిర్మలమ్మ ఏం చెప్పారంటే
కరోనా విస్తరణను అడ్డుకునే చర్యల్లో ప్రభుత్వం పూర్తి లాక్డౌన్ విధించదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించమని, స్థానికంగా మాత్రం నియంత్రణ చర్యలు ఉంటాయన్నారు. ఆర్థిక వ్యవస్థను పూర్తిగా సంక్షోభంలోకి నెట్టడం ఇష్టం లేదని, అందుకే దేశవ్యాప్త లాక్ డౌన్ ఉండదని స్పష్టం చేశారు. కరోనా కట్టడికి ఆయా కంటైన్మెంట్ జోన్లలో కఠిన చర్యలపై ఆధారపడతాన్నారు. ఆయా రాష్ట్రాల కోవిడ్ సమాచారాన్ని సేకరించామని, చర్యలు బావున్నాయన్నారు.
ఇలా ముందుకు
ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ డేవిడ్ మాల్పాస్తో జరిగిన వర్చువల్ సమావేశంలో నిర్మలా ఈ వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమలతో పాటు ఆర్థిక వ్యవస్థపై లాక్డౌన్ ప్రభావాల గురించి మాట్లాడారు. టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సిన్, కరోనా నిబంధనలు లాంటి అయిదు స్థంభాల వ్యూహంతో కట్టడి చేస్తామన్నారు. కోవిడ్ బారినపడిన వారిని హోంక్వారంటైన్ చేస్తామన్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తగిన చర్యలు చేపడతామన్నారు. దేశానికి ఆర్థిక లభ్యతను, రుణ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రపంచ బ్యాంక్ చేపట్టిన చర్యలను సీతారామన్ ప్రశంసించారు.