loan moratorium: వారికి మాఫీ చేస్తాం.. వడ్డీపై కేంద్రప్రభుత్వం భారీ ఊరట
కరోనా వైరస్ సమయంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా లోన్ మారటోరియంను ఉపయోగించుకున్న సామాన్యులకు, చిన్న కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కలిగించనుంది! లోన్ మారటోరియం కాలంలో కాంపౌండ్ వడ్డీరేటు (వడ్డీ పైన వడ్డీ) వేసేందుకు బ్యాంకులు, ఆర్బీఐ మొగ్గు చూపాయి. దీనిపై కస్టమర్ల తరఫున కొందరు సుప్రీం కోర్టుకు వెళ్లడంతో.. అత్యున్నత న్యాయస్థానం కేంద్రం అభిప్రాయం కోరింది. ఇప్పుడు కేంద్రం వారికి గుడ్న్యూస్ చెప్పేందుకు సిద్ధం అయింది. ఈ మేరకు తన అభిప్రాయాన్ని సుప్రీం కోర్టుకు తెలిపింది. వడ్డీ పైన వడ్డీని మాఫీ చేస్తామని అత్యున్నత న్యాయస్థానానికి స్పష్టం చేసింది.
లోన్ మారటోరియం, వడ్డీకి సంబంధించిన మరిన్ని కథనాలు..
రూ.2 కోట్ల వరకు రుణాలపై చక్రవడ్డీ మాఫీ
లోన్ మారటోరియం కాలంలో వడ్డీపై వడ్డీని/చక్రవడ్డీ రద్దు చేస్తామని సుప్రీం కోర్టులో సమర్పించిన ప్రమాణపత్రంలో కేంద్రం తెలిపింది. రూ.2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీ ఉండదని స్పష్టం చేసింది. మార్చి నుంచి ఆగస్ట్ మధ్య చెల్లించని రుణాలపై వడ్డీ మీద వడ్డీ భారం పడదని అఫిడవిట్లో పేర్కొంది. దీంతో ఈ నిర్ణయం లక్షలాది రుణగ్రహీతలకు ఊరట లభించినట్లయింది. గతంలో ఎప్పుడూ లేని ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం వద్ద ఉన్న పరిష్కారం వడ్డీపై వడ్డీ భారాన్ని ఎత్తివేయడమేనని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తన అఫిడవిట్లో పేర్కొంది.
పార్లమెంటులో ఆమోదం.. ఆ భారం మాదే.. ప్రభుత్వం
నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వ్యక్తిగత రుణగ్రహీతలకు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఎంతో ఊరట కలిగించే అంశం. కరోనా కాలంలో చెల్లింపుపై ఆరు నెలల పాటు మారటోరియం నేపథ్యంలో వడ్డీపై వడ్డీ వసూలు చేయరు. ఈ చక్రవడ్డీల భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని తెలిపింది. ఇందుకు అవసరమైన గ్రాంట్స్ కోసం పార్లమెంటు ఆమోదం తీసుకోవాల్సి ఉందని తెలిపింది. రుణాలపై మారటోరియం విధించినదున వడ్డీ మాఫీ చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని విచారిస్తున్న జస్టిస్ అశోక్ భూషణ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ముందు ఈ ప్రమాణ పత్రాన్ని సమర్పించింది. వడ్డీపై వడ్డీని మాఫీ చేస్తే బ్యాంకులపై భారం పడుతుందని తొలుత ఆర్బీఐ, కేంద్రం సుప్రీంకు తెలిపాయి. వడ్డీ మొత్తం మాఫీ చేయాలంటే రూ.6 లక్షల కోట్లు అవసరమవుతాయని ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులకు తోడు సామాన్యుల ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వంపై రూ.6వేల కోట్ల భారం
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు(ఎంఎస్ఎంఈ), స్టడీ లోన్, హోమ్ లోన్, సెల్ ఫోన్ వంటి వస్తువుల కొనుగోలుపై, క్రెడిట్ కార్డు బకాయిలు, వాహన లోన్, పర్సనల్ లోన్, ఇతరత్రా కొనుగోళ్లపై రుణాలపై వడ్డీపై వడ్డీ మాఫీ అవుతుంది.
కాగా, ఈ నిర్ణయంతో బ్యాంకులపై రూ.ఐదువేల కోట్ల నుంచి ఆరువేల కోట్లు పడే భారాన్ని కేంద్రప్రభుత్వం భరిస్తుంది. రూ.2 కోట్ల వరకు రుణాలపై కాకుండా మొత్తం రుణగ్రహీతలందరికీ చక్రవడ్డీ భారాన్ని తొలగిస్తే రూ.10వేల కోట్ల నుంచి రూ.15 వేలకోట్ల భారం పడుతుందని అంచనా. అన్ని అన్ని రకాల రుణాలపై వడ్డీ భారాన్ని ఎత్తివేస్తే బ్యాంకులపై రూ.6 లక్షల కోట్ల భారం పడుతుందని కేంద్రం ఇదివరకే అంచనా వేసింది.