హైదరాబాద్ మోడల్ అదుర్స్! అదే దారిలో విజయవాడ, తిరుపతి: రూ.వేల కోట్ల సమీకరణ
ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల ఆస్తుల నిర్వహణ ప్రయివేటీకరణకి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. నాలుగేళ్లలో దాదాపు రూ.6 లక్షల కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్రభుత్వం నేషనల్ మోనెటైజేషన్ పైప్లైన్ను(NMP) ప్రకటించింది. ఈ NMPలోకి కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల ముఖ్యమైన, మౌలిక వసతులు వస్తాయి. సమీకరణలో భాగంగా 2021-22లో రూ.88వేల కోట్లు, 2022-23లో రూ.1.62 లక్షల కోట్లు, 2023.24లో రూ.1.79 లక్షల కోట్లు, 2024-25లో రూ.1.67 లక్షల కోట్లు సమీకరిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సమకూరే నిధులను మళ్లీ మౌలిక వతుల కల్పనకు వెచ్చిస్తామని నిర్మలమ్మ చెప్పారు. అయితే ఇక్కడ మోనెటైజేషన్ అంటే ఆస్తుల విక్రయంకాదు. ఆస్తులను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు ప్రయివేటు సంస్థలకు అప్పగిస్తారు. గడువు తీరిన తర్వాత వాటిని తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాలి.
12 శాఖలకు చెందిన ఇరవైకి పైగా ఆస్తులు NMPలో ఉంటాయి. ఇందులో ప్రధానంగా రోడ్లు, రైల్వేలు, విద్యుత్ వ్యవస్థ ఉంది. 2022 నుండి 2025 నాటికి ఈ కార్యక్రమం అమలవుతుంది. ఆపరేటర్ మెయింటెనెన్స్, ట్రాన్సుఫర్, టోల్ ఆపరేటర్ ట్రాన్సుఫర్, ఆపరేషన్, మెయింటెనెన్స్, డెవలప్మెంట్, రిహాబిలిటేట్ ఆపరేట్ మెయింటెయిన్ ట్రాన్సుఫర్ విధానాలలో ఈ ఆస్తులను అప్పగిస్తారు.
రైల్వేలో 400 స్టేషన్లు, 90 పాసింజర్ రైళ్లు, 1400 కిలో మీటర్ల ట్రాక్, 265 గూడ్స్ షెడ్లు, 741 కిలో మీటర్ల కొంకణ్ రైల్వే, 4 హిల్ రైల్వే, 674 కిలో మీటర్ల డెడికేటెడ్ ప్రైట్ కారిడార్, 15 రైల్వే స్టేడియంలు ప్రయివేటు వారికి పరిమిత కాలం అప్పగిస్తారు. అదే సమయంలో ఎయిర్ పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా(AAI) ఆధ్వర్యంలోని 25 విమానాశ్రయాలను ప్రయివేటీకరిస్తారు. 9 మేజర్ పోర్టుల్లోని 31 ప్రాజెక్టులను పీపీపీ విధానంలో అప్పగిస్తారు. బీబీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్, డిపార్టుమెంట్ టెలీ కమ్యూనికేషన్స్లోని ఆస్తులను ప్రయివేటు వారికి అప్పగిస్తారు. జాతీయ స్టేడియంలు, ప్రాంతీయ కేంద్రాలు, పట్టణ ప్రాంతాల్లోని కాలనీలు, గెస్ట్ హౌస్లు, హోటల్స్ వంటి వాటిని ప్రయివేటుకు అప్పగిస్తారు.
ఏ రంగం నుండి ఎంత అంటే
- 26,700 కిలో మీటర్ల రోడ్ రంగం అప్పగింత ద్వారా రూ.1,60,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
- 28,608 సీకేటీ కిలో మీటర్ల విద్యుత్ సరఫరా అప్పగింత ద్వారా రూ.45,200 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
- 6 గిగా వాట్ల జల, సౌర విద్యుత్ ఉత్పత్తి ద్వారా రూ.39,832 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
- 8,154 కిలో మీటర్ల సహజవాయు పైప్ లైన్ అప్పగింత ద్వారా రూ.24,462 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
- 3,930 కిలో మీటర్ల పెట్రోలియం పైప్ లైన్ ద్వారా రూ.22,503 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
- 210 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాముల ఆస్తుల ద్వారా రూ.28,900 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
- 8 రకాల రైల్వే ఆస్తుల ద్వారా రూ.1,52,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
- టెలికం రంగంలో 2.86 లక్షల కిలో మీటర్ల ఫైబర్, 14,917 టవర్ల ద్వారా రూ.35,100 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
- 25 AAI విమానాశ్రయ ప్రయివేటీకరణ ద్వారా ద్వారా రూ.20,782 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
- నౌకాయాన రంగంలో 9 మేజర్ పోర్టుల్లోని 31 ప్రాజెక్టుల ద్వారా రూ.12,828 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
- బొగ్గు, గనుల రంగంలోని 160 బొగ్గు, 761 ఇతర గనుల వేలం ద్వారా రూ.28,747 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
- క్రీడా రంగంలోని రెండు జాతీయ స్టేడియంలు, రెండు ప్రాంతీయ కేంద్రాల ద్వారా రూ.11,450 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
- పట్టణ రియల్ ఎస్టేట్ రంగంలోని కాలనీలు, ఆతిథ్య కేంద్రాల ద్వారా రూ.15,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
విమానాశ్రయాల విషయానికి వస్తే వారణాసి, చెన్నై, నాగపూర్, భువనేశ్వర్ తదితర 25 AAI విమానాశ్రయాలను రానున్న నాలుగేళ్లలో ప్రయివేటుకు అప్పగిస్తారు. ఉదయ్పూర్, డెహ్రాడూన్, ఇండోర్, రాంచీ, కోయంబత్తూరు, జోద్పూర్, వడోదర, పాట్నా, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టైర్ 2, టైర్ 3 నగరాలైన అమృత్సర్, వారణాసి, భువనేశ్వర్, ఇండోర్, రాయపూర్, తిరుచ్చి విమానాశ్రయాలను అప్పగించనుంది. AAI దేశంలో 137 విమానాశ్రయాలు నిర్వహిస్తోంది. ఇందులో 24 అంతర్జాతీయ విమానాశ్రయాలు, 10 కస్టమ్ విమానాశ్రయాలు, 103 డొమెస్టిక్ విమానాశ్రయాలు ఉన్నాయి.
ఇప్పటికే ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు విమానాశ్రయాలను ఇలా (PPP) అప్పగించి ప్రభుత్వం విజయవంతమైంది. ఈ విమానాశ్రయాలు PPP నిర్వహణలో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. చెన్నై, వడోదర వంటి పెద్ద విమానాశ్రయాలను 2023-24 ఆర్థిక సంవత్సరంలో, కాలికట్, కోయంబత్తూరు, మధురై, జోద్పూర్ తదితర ఎనిమిది విమానాశ్రయాలను 2022-23లో, డెహ్రాడూన్, అగర్తాలా, ఉదయ్పూర్ విమానాశ్రయాలు 2024-25 ఆర్థిక సంవత్సరంలో PPP మోడల్కు తీసుకు రానుంది.
ఇదిలా ఉండగా, ఎయిరిండియా వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ఫైనాన్షియల్ బిడ్డింగ్ ప్రక్రియ వచ్చే నెలలో ఉంటుందని డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్(DIPAM) తెలిపింది. అలాగే దీనిని ఈ ఏడాది డిసెంబర్ నాటికి అప్పగించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. BPCL ట్రాన్సాక్షన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి పూర్తి కావొచ్చునని, ఫైనాన్షియల్ బిడ్డింగ్ డిసెంబర్ నాటికి పూర్తవుతుందని తెలిపింది.