టిక్టాక్ సహా చైనీస్ యాప్స్ని తొలగించాలని గూగుల్ యాప్, ఆప్ స్టోర్ను ప్రభుత్వం ఆదేశించిందా?
భారత్ - చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయుల్లో ఆగ్రహం పెల్లుబికింది. చైనీస్ ఉత్పత్తులు కొనుగోలు చేయమని చాలామంది చెబుతుండటంతో పాటు ట్రేడర్స్ కూడా చైనా ఉత్పత్తులను దూరం పెడుతామని ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా, ప్రభుత్వం చైనీస్ యాప్స్ను నిషేధించనుందని, ఈ మేరకు టెక్ కంపెనీలకు సూచించిందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఇది నకిలీ వార్త అని ప్రెస్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ట్విట్టర్ ద్వారా తెలిపింది.
సరిహద్దులో టెన్షన్: ఈ భారతీయ కంపెనీల్లో చైనీస్ పెట్టుబడులు, మరి ఇప్పుడు?
చైనీస్ యాప్స్కు నో అంటూ
ఈ ప్రచారం ప్రకారం ఆపిల్, గూగుల్ యాప్స్ నుండి చైనీస్ యాప్స్ను తొలగించాలని, చాలా యాప్స్ చైనీస్ సార్వభౌమాధికారం, భారత పౌరుల డేటా గోప్యత గురించి ఆందోళనల నేపథ్యంలో చైనీస్ యాప్స్ను తొలగించాలని ఆదేశించినట్లుగా ఉంది. కొన్ని యాప్స్కు మాత్రమే అనుమతి ఉన్నట్లుగా ఉంది. అభ్యంతరక యాప్స్లో టిక్ టాక్, లైవ్మి, బిగో లైవ్, విగో వీడియో, బ్యూటీ ప్లస్, క్యామ్స్కానర్, క్లాష్ ఆఫ్ కింగ్స్, మొబైల్ లెజెండ్స్,క్లబ్ ఫ్యాక్టరీ, షీన్, రామ్వే, యాప్ లాక్, గేమ్ ఆఫ్ సుల్తాన్ వంటివి ఉన్నాయి. కొన్ని యాప్స్ను నిషేధించినట్లుగా ఉంది.
అది ఫేక్..
ఈ మేరకు పీఐబీ (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) ఇది ఫేక్ న్యూస్ అని పేర్కొంటూ ట్వీట్ చేసింది. యాప్స్ స్టోర్లలోని పలు చైనీస్ యాప్స్ను నిషేధించినట్లు మెసేజ్ వైరల్ అవుతోందని, కానీ ఇది ఫేక్ అని, ప్రభుత్వం నుండి అలాంటి సూచనలు ఏమీ లేవని పేర్కొంది. అయితే చైనా-భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చాలామంది భారతీయులు చైనా వస్తువులను బహిష్కరించాలని ఉద్యమిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒప్పో ఇటీవల తన లైవ్ డివైస్ లాంచ్ను కూడా వాయిదా వేసుకుంది.
ఇది వరకు కూడా..
ఇటీవల ఇంటెలిజెన్స్ బ్యూరో చైనాకు సంబంధించిన 52 యాప్స్ను పర్యవేక్షణలో ఉంచిందని వార్తలు వచ్చాయి. వీటిని నిషేధించే అంశాన్ని పరిశీలించాలని, ప్రజలకు కూడా ఉపయోగించవద్దని సూచించాలని ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రభుత్వానికి నివేదించినట్లుగా ప్రచారం సాగింది. అయితే ప్రస్తుత టెన్షన్ వాతావరణంలో కొన్ని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి.