చైనాకు చెక్: ఇండియా నుంచే భారీగా స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు!
సెల్ ఫోన్. ఇది లేనిదే మన రోజు గడవదు. ఇది మన నిత్యావర వస్తువు అయిపోయింది. ఒకప్పుడు మనం ఫోన్లన్నీచైనా నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళం. కానీ కొంత కాలంగా ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. మొబైల్ ఫోన్లు తయారు చేసే పెద్ద పెద్ద కంపెనీలు భారత్ లోనే వాటిని తయారు చేయటం మొదలు పెట్టాయి. అమెరికా దిగ్గజం ఆపిల్ కూడా ఈ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే సామ్ సంగ్, రెడీమి, ఒప్పో, వివో, సెల్ కాన్ వంటి కంపెనీలు మన దేశంలోనే మొబైల్ ఫోన్ల ను తయారు చేస్తున్నాయి.
మరీ ముఖ్యంగా ఇందులో మెజారిటీ ఫోన్లు మన తెలుగు రాష్ట్రాల్లోనే తయారు అవుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లోనే శ్రీ సిటీ, తెలంగాణాలో హైదరాబాద్ లో ఫోన్లు తయారు అవుతున్నాయి. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ దృష్టి కేవలం భారత్ లో తయారీ (మేక్ ఇన్ ఇండియా) పైనే కాకుండా మేక్ ఫర్ ది వరల్డ్ (ప్రపంచం కోసం) అనే కాన్సెప్ట్ పైకి మళ్లింది. ఎటూ ఇండియా లో స్మార్ట్ ఫేన్ల తయారీ జరుగుతోంది. దీనిని ఇంకా పెంచి ప్రపంచ దేశాలకు ఇక్కడి నుంచే ఎగుమతి చేస్తే బాగుంటుందనే అంశంపై సీరియస్ గా ఆలోచిస్తోంది. ఇందుకోసం మొబైల్ ఫోన్ తయారీ కంపెనీలకు మెరుగైన ప్రోత్సాహకాలు ఇచ్చి వారిని ఎగుమతులు పెంచేలా ఊరిస్తోంది.
'స్విస్ ఖాతాల వివరాలు ఇవ్వలేం, గోప్యంగా ఉంచాలని నిబంధన'
2025 నాటికి 110 బిలియన్ డాలర్లు...
పోరాడితే పోయేదేమీ లేదు అనే స్ఫూర్తిని ప్రభుత్వం ఈ విషయంలో అమలు చేయబోతోంది. ఎదో ఎగుమతి చేయాలి కాబట్టి చేయకుండా... భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. వచ్చే ఐదేళ్ళలో (2025) ఏకంగా 110 బిలియన్ డాలర్ల (సుమారు రూ 7,70,000 కోట్లు) ఎగుమతులు చేయాలనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఆయా మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీలకు 6% డ్యూటీ క్రెడిట్ స్క్రిప్ లను అందించాలని భావిస్తోంది. ప్రస్తుతం ఇది 4% వరకు ఉంది. పరిశ్రమ వర్గాలు దీనిని 8% పెంచాలని కోరాయి. అయితే, 6% డ్యూటీ క్రెడిట్ స్రిప్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. డ్యూటీ క్రెడిట్ స్క్రిప్ లను కంపెనీలు కస్టమ్స్ సుంకాలు చెల్లించేప్పుడు వినియోగించుకోవచ్చు. అంటే కంపెనీలకు 6% వరకు కస్టమ్స్ సుంకం తగ్గుతుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం మన దేశం నుంచి సుమారు 3 బిలియన్ డాలర్ల (దాదాపు రూ 21,000 కోట్ల) విలువైన స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు జరుగుతున్నాయి.
చైనాకు చెక్ పెట్టేందుకే...
అమెరికా, చైనా ల మధ్య జరుగుతున్న ట్రేడ్ వార్ నేపథ్యం లో పెద్ద సంఖ్యలో తయారీ కంపెనీలను చైనా నుంచి మన దేశం వైపు ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకోంది. 2019 అక్టోబర్ నుంచి కొత్తగా ఏర్పాటు చేసే తయారీ రంగ కంపెనీలకు కార్పొరేట్ పన్ను కేవలం 15% ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఇప్పటికే స్పష్టం చేసారు. ఇది చైనా పన్ను రేటు తో పోటీ పడేందుకు పనికొస్తుంది. అదే సమయంలో చైనా నుంచి వెళుతున్న కంపెనీలు చాలా వరకు వియత్నాం, ఇండోనేషియా, మలేషియా వైపు అడుగులు వేస్తుతున్నాయి. వాటిని ఇండియా కు రప్పించేందుకు ఇంకా ఆకర్షణీయమైన రాయితీలు ఉండేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొంటోంది. ఈ దిశగా వ్యూహాలు ఖరారు చేసేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించింది కూడా. నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ నేతృత్వం లో ఈ కమిటీ ఏర్పాటైంది. త్వరలోనే అది తన సిఫార్సులను అందించనుంది.
డబ్ల్యుటి ఓ సమస్య...
వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజషన్ (డబ్ల్యు టి ఓ ) లో భారత్ కూడా భాగస్వామ్య దేశం. కాబట్టి ఎగుమతులపై భారీ ప్రోత్సాహకాలు ఇవ్వటం నిషేధం. ఇది ప్రపంచ స్వేచ్ఛ వాణిజ్యానికి వ్యతిరేకం. అందుకే ప్రభుత్వం కొత్తగా ప్రత్యామ్నాయ పద్ధతులను వెతుకుతోంది. 6% డ్యూటీ క్రెడిట్ విధానం అందులో భాగమే. అందుకే ఈ విధానానికి ప్రపంచ వాణిజ్య సంస్థ నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాకుండా ఉండేలా భారత్ కొత్త విధానాన్ని రూపొందించుతోందని ఉన్నతాధికారులు వెల్లడించారు. త్వరలోనే కేంద్ర కాబినెట్ ఈ సరికొత్త స్కీం కు ఆమోదం తెలిపే అవకాశం ఉందని చెప్పారు.
విధాన స్పష్టత...
ప్రస్తుతం మన దేశంలో ఫాక్స్ కాన్ అనే మొబైల్ తయారీ సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ. ఆపిల్ నుంచి సామ్ సంగ్ వరకు, ఒప్పో నుంచి వివో వరకు దాదాపు అన్ని కంపెనీలు ఫాక్స్ కాన్ వద్దనే తమ ఫోన్లు తయారు చేయిస్తాయి. ప్రపంచంలోని సుమారు 80% మొబైల్ ఫోన్లను ఈ కంపెనీయే తయారు చేస్తుంది. అయితే, ప్రస్తుతం ఇది ఇండియా అవలంభిస్తున్న ఎగుమతుల విధానంపై స్పష్టత కోరుతోంది. చైనా తో పోల్చితే భారత రాయితీలు 19% వరకు, వియాత్నంతో పోల్చితే 10% వరకు తక్కువగా ఉంటున్నాయి. అందుకే తమకు 8% వరకు డ్యూటీ క్రెడిట్ స్రిప్స్ ఇవ్వాలని మొబైల్ ఫోన్ కంపెనీల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.