ఆ రోజే ఆదేశాలు: రుణగ్రహీతలకు సుప్రీం ఊరట, మారటోరియం రద్దుపై కమిటీ
లోన్ మారటోరియం రుణాలకు సంబంధించి వడ్డీ మాఫీని అంచనా వేయడానికి, ఇతర అన్ని అంశాలను పరిష్కరించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని, అధ్యయనం చేసి రుణగ్రహీతలకు ఉపశమనం కలిగించే సూచనలు చేయాలని కోరినట్లు కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ గురువారం సుప్రీం కోర్టుకు వెల్లడించింది.
మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ జనరల్ రాజీవ్ మెహర్షి, నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఈ కమిటీలో మాజీ మానిటరీ పాలసీ కమిటీ సభ్యులు రవీంద్ర హెచ్ ధోలారియా, ఎస్బీఐ మాజీ మేనేజింగ్ డైరెక్టర్-ఐడీబీఐ బ్యాంకు బీ శ్రీరామ్ ఉన్నారు. మారటోరియం సమయంలో రుణాలపై వడ్డీ రద్దు అంశాన్ని సమీక్షించి, సిఫార్సు చేయనుంది. ఈ కమిటీ వారంలో నివేదికను సమర్పించనుంది.
లోన్ మారటోరియం కేసు: కేంద్రం, ఆర్బీఐకు సుప్రీం చివరి అవకాశం
ఎన్పీఏలుగా ప్రకటించవద్దు
లోన్ మారటోరియంకు సంబంధించి సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆగస్ట్ 31వ తేదీ వరకు ఎన్పీఏల కిందకు రాని అకౌంట్లను వేటిని కూడా ఎన్పీఏలుగా ప్రకటించవద్దని గతంలో ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను సుప్రీం కోర్టు మరో రెండు వారాలు పొడిగించింది. మారటోరియం కాలంలో చెల్లించని వాయిదాలపై వడ్డీ విధింపు అంశానికి సంబంధించి రెండు వారాల్లో అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆర్బీఐ, కేంద్రాన్ని ఆదేశించింది. అన్ని అంశాలను సమగ్రంగా పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాలని సూచించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 28వ తేదీకి వాయిదా వేసింది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం లోన్ మారటోరియంపై విచారణ జరుపుతోంది. ఇదే తుది అవకాశమని, ఈ అంశాన్ని ఇక వాయిదా వేయడం కుదరదని స్పష్టం చేసింది.
ఆ రోజు నిర్ణయం తీసుకుంటాం..
లోన్ మారటోరియం సమయంలో చక్రవడ్డీ, క్రెడిట్ రేటింగ్, డౌన్ గ్రేడింగ్కు సంబంధించి నిర్దేశిత వివరాలను తదుపరి విచారణ జరిగే రోజున సమర్పించాలని సుప్రీం కోర్టు సూచించింది. ఆ వివరాల ఆధారంగ అందుకు తగినట్లు ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది. కోర్టు ప్రస్తావించిన అంశాలపై అఫిడవిట్ సమర్పించేందుకు రెండు వారాల సమయాన్ని ఇచ్చింది సుప్రీం కోర్టు. ఈ రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేస్తామని, ఆర్బీఐ, కేంద్రం తీసుకునే నిర్ణయాలను నమోదు చేస్తామని ప్రభుత్వ తరఫున వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వివిధ వర్గాలకు ప్రయోజనాలను పొడిగించేందుకు చేపట్టే చర్యలపై 2వారాల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు.
డౌన్ గ్రేడింగ్
ప్రస్తుతం ఉన్న రుణ పునర్వ్యవస్థీకరణతో 95 శాతం మంది రుణగ్రహీతలకు న్యాయం జరగదని క్రెడాయ్ తరఫు లాయర్ కపిల్ సిబాల్ కోర్టుకు తెలిపారు. బ్యాంకులు రుణగ్రహీతల అకౌంట్ల డౌన్ గ్రేడింగ్ చేస్తున్నాయని, దీనిని నిలిపివేయాలని, మారటోరియంను పొడిగించాలని కోరారు. బ్యాంకులు మారటోరియం సమయానికి చక్రవడ్డీలు వేస్తున్నాయని మరో న్యాయవాది చెప్పారు. కరోనా సమయంలో వడ్డీపై వడ్డీ మంచిది కాదన్నారు.