vodafone idea: బకాయిలను ఆ విధంగా కట్టమని వొడాఫోన్ ఐడియాకు ఆదేశం..
vodafone idea: ఎన్నో కంపెనీలతో ఓ వెలుగు వెలిగిన భారత టెలికాం రంగం.. జియో ఎంట్రీతో మూగ బోయిందనేది విశ్లేషకుల మాట. గతంలో దాదాపు 10 సంస్థల మధ్య తీవ్రమైన పోటీ ఉండేది. ఒకరిని మించి మరొకరు ఆఫర్లు ఇస్తూ, వినియోగదారులను ఆకట్టుకోవడానికి ప్రయత్నించే వారు. ప్రస్తుత పరిస్థితి అందుకు పూర్తిగా విరుద్ధం. నాలుగైదు కంపెనీలు మినహా మార్కెట్ లో ఎవరూ లేరు. అంబానీతో పోటీ పడలేక, ఆ నలుగురి పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. వొడాఫోన్ ఐడియా అయితే పోటీతో పాటు అప్పులతోనూ సతమతమవుతోంది.
ప్రభుత్వ ఆదేశాలు:
ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలన్నిటినీ ఈక్విటీగా మార్చాలని సర్కారు ఆదేశించినట్లు వొడాఫోన్ ఐడియా తెలిపింది. దాదాపు 161 బిలియన్ రూపాయలను షేర్లుగా మార్చాల్సి ఉందని వెల్లడించింది. ఒక్కో దాని విలువ 10 రూపాయల చొప్పున 16.13 బిలియన్ షేర్లను జారీ చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నట్లు చెప్పింది.
గతేడాదే ఆమోదం:
వొడాఫోన్ ఐడియా బకాయిలను ఈక్విటీగా మార్చడానికి క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ గతేడాదే ఆమోదం తెలిపినట్లు ఓ ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. స్పెక్ట్రమ్ కోసం చెల్లించాల్సిన వడ్డీతో సహా ఎయిర్ వేవ్ లు వినియోగించుకున్నందుకు ప్రభుత్వానికి బకాయి పడిన మొత్తం స్థానంలో షేర్లను బదిలీ చేయాలని ఇప్పుడు ప్రభుత్వం ఆదేశించింది.
ఇదీ రెస్క్యూ ప్యాకేజీ:
అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెలికాం కంపెనీల కోసం భారత ప్రభుత్వం 2021లో ఓ రెస్క్యూ ప్యాకేజీని ప్రకటించింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన AGR (సర్దుబాటు చేయబడిన స్థూల రాబడి) పై వడ్డీని ఈక్విటీగా మార్చడానికి వీలు కల్పించింది. అంతకు ముందు 2020లో, బకాయిలను క్లియర్ చేయడానికి టెలికాం సంస్థలకు సుప్రీంకోర్టు పదేళ్లపాటు(2031 వరకు) గడువు ఇచ్చింది.