Budget 2021-22: కరోనా వ్యాక్సీన్ కోసం ఖర్చులు, సంపన్నులపై కరోనా సెస్?
కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020-21) ప్రభుత్వానికి ఆదాయం భారీగా తగ్గడంతో పాటు ఖర్చులు పెరిగాయి. కరోనా వ్యాక్సినైజేషన్ ప్రభుత్వానికి భారం మోపెడు అవుతోంది. కరోనా వల్ల ఏప్రిల్ నుండి ఆర్థిక కార్యకలాపాలు స్తంభించాయి. దీంతో దాదాపు సెప్టెంబర్ వరకు జీఎస్టీ కలెక్షన్లు సహా ఇతర ప్రభుత్వ ఆదాయాలు పడిపోయాయి. కరోనా వల్ల కేంద్రానికి ఖర్చులు పెరిగాయి. దీంతో కేంద్రం కరోనా సెస్ ఆలోచన చేస్తోందని తెలుస్తోంది.
Budget 2021-22: ఈ ఏడాది బడ్జెట్ పత్రాల్లేవు! ఎందుకంటే
బడ్జెట్ నాటికి నిర్ణయం
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ బడ్జెట్కు ముందే సంపన్నులపై కరోనా సెస్ ఆలోచన చేస్తోంది కేంద్రం. మహమ్మారి కారణంగా భారీఖర్చుల నేపథ్యంలో అదనపు నిధులు సమకూర్చుకోవడానికి కరోనా సెస్ లేదా సర్ఛార్జీని విధించే అంశంపై ప్రభుత్వం ప్రాథమికంగా చర్చలు జరిపింది. సెస్ లేదా సర్ఛార్జీ రూపంలో కొత్త లెవీని విధించాలా వద్దా అనే అంశంపై తుది నిర్ణయం బడ్జెట్కు ముందు తీసుకోవచ్చునని, దీనిని బడ్జెట్ సమయంలో(ఫిబ్రవరి 1) ప్రకటించవచ్చునని భావిస్తున్నారు.
కొత్త పన్నులు వద్దని పరిశ్రమ
కరోనా కారణంగా ఇప్పటికే ఆర్థిక ఒత్తిడిలో ఉన్న నేపథ్యంలో కొత్త పన్నులు విధించవద్దని వివిధ రంగాలు, పరిశ్రమలు కేంద్రాన్ని కోరుతున్నాయి. కరోనా సెస్ లేదా సర్ఛార్జీ విధించేందుకు ఇది సమయం కాదని అంటున్నారు. కరోనా సెస్ లేదా సర్ఛార్జీని అమలు చేస్తే ప్రభుత్వానికి రాబడి పెరుగుతుంది.
ఇంధన ఉత్పత్తుల పైనా
కరోనా సెస్ అంశంపై చర్చించినట్లు ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. అధిక ఆదాయం లేదా సంపన్నులు, కొత్త పరోక్ష పన్నులపై సెస్ అంశం చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, ఇంధనంపై కూడా సెస్ విధించే అంశాన్ని పరిశీలిస్తోంది. కరోనా టీకా వ్యాక్సీకరణ కోసం (లాజిస్టిక్ ఖర్చులు సహా) రూ.60,000-65,000 కోట్లు అవుతాయని అంచనా.