లాక్డౌన్ సడలించే సమయంలో ప్యాకేజీ, కన్స్యూమర్ సెంటిమెంట్ పెంచాలి
కరోనా సెకండ్ వేవ్ కట్టడికి వివిధ రాష్ట్రాలు అమలు చేస్తోన్న లాక్ డౌన్, కరోనా కఠిన ఆంక్షలు సడలించే సమయంలో కేంద్రం మరో ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉందని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ బెర్న్స్టెయిన్ అభిప్రాయపడింది. ఏప్రిల్, మే... ఈ రెండు నెలల్లో భారత ఆర్థిక క్రియాశీలత తీవ్రంగా దెబ్బతిన్నదని పేర్కొంది. ఇంధన వినియోగం, విద్యుత్ డిమాండ్, ఈ-వే బిల్లు, పారిశ్రామిక ఉత్పత్తి వంటి అంశాల్లో ప్రతికూల గణాంకాలు నమోదవుతున్నట్లు తెలిపింది. సరఫరా సమస్యలు కూడా తీవ్రమైందని కూడా వెల్లడించింది. ద్రవ్యోల్భణం పరిస్థితులు కొంత అదుపులోనే ఉండవచ్చునని, సెకండ్ వేవ్ వల్ల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసినప్పటికీ, ఫస్ట్ వేవ్ అంత ప్రభావం లేదని వెల్లడించింది.
40,000 డాలర్లకు చేరుకున్న బిట్ కాయిన్, ఏడాదిలో 14000 శాతం పెరిగిన డోజీకాయిన్
తగ్గిన వినియోగం
మే నెలలో ఎనర్జీ వినియోగం తగ్గిందని, విద్యుత్ వినియోగం నాలుగు శాతం మేర తగ్గిందని, చమురు వినియోగం 16 శాతం క్షీణించిందని తెలిపింది.ఈ-వే బిల్లులు 6 శాతం క్షీణించాయని తెలిపింది. కొన్ని ఉత్పత్తులు పడిపోయాయని, అత్యవసరం కాని ఉత్పత్తుల కొనుగోళ్లు తగ్గినట్లు తెలిపింది. అయితే ఆయా రాష్ట్రాల్లో ఉత్పత్తి, సరఫరాపై ఆంక్షలు తక్కువగా ఉన్నాయని, కాబట్టి గతంలో వలె ప్రభావం పడటం లేదని తెలిపింది.
మరో ప్యాకేజీ
వినియోగ సామర్థ్యం తగ్గిందని, ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం మరో ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉందని తెలిపింది. అన్-లాక్ దశ ప్రారంభమైనప్పుడు కేంద్రం ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించవచ్చునని బెర్న్స్టెయిన్ పేర్కొంది. ప్రధానంగా అనార్గనైజ్డ్ ఎండ్ మార్కెట్ (ఎస్ఎంఈలు, సెల్ఫ్ ఎంప్లాయిడ్) పైన భారీగా ప్రభావం పడిందని తెలిపింది. దిగువ మధ్య తరగతి కుటుంబంపై ప్రభావం ఎక్కువే ఉందని, అప్పర్ మిడిల్ క్లాస్లోను కన్స్యూమర్ సెంటిమెంట్ బలహీనంగా ఉందని పేర్కొంది. ఈ సమస్యలను పరిష్కరించాల్సి ఉందని తెలిపింది.
కన్స్యూమర్ సెంటిమెంట్ పెంచాలి
రుణం రూపంలో లేదా గ్యారంటీ రూపంలో ఎలాగైనా ప్యాకేజీ అవశ్యమని అభిప్రాయపడింది. ఏదేమైనా ప్రభుత్వం నుండి కన్స్యూమర్ సెంటిమెంట్ను పెంచాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. కరోనా కేసులు ఇటీవలి వరకు రోజుకు 3 లక్షలకు పైగా నమోదయ్యాయి. మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీ, చత్తీస్గఢ్, ఉత్తర ప్రదేశ్లలో 36 శాతం కరోనా కేసులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ రాష్ట్రాల్లో కేసులు తగ్గుతున్నాయి. ప్రస్తుతం ఈ రాష్ట్రాల కేసుల వాటా 30 శాతానికి దిగి వచ్చింది. ఏప్రిల్ నెలలో ఇది 70 శాతంగా ఉంది. ఆ తర్వాత తమిళనాడు, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కేసుల వాటా 48 శాతంగా ఉంది. ఈ రాష్ట్రాల జీడీపీ 25 శాతం. దేశంలో 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉండగా, ఇందులో 31 చోట్ల లాక్ డౌన్ ఉంది.