టెల్కోలను కొనే ఆసక్తి ప్రభుత్వానికి లేదు: వొడాఫోన్ ఐడియా సీఈవో
టెలికం కంపెనీలను కొనుగోలు చేయడంపై ప్రభుత్వానికి ఎలాంటి ఆసక్తి లేదని వొడాఫోన్ ఐడియా ఎండీ, సీఈవో రవీందర్ టక్కర్ అన్నారు. బకాయిలపై వడ్డీలను ఈక్విటీల రూపంలో చెల్లించే సదుపాయం కల్పించిందని తెలిపారు. తమ కంపెనీ మార్కెట్లో పోటీపడాలని ప్రభుత్వం ఆశిస్తోందని, దేశంలో కనీసం మూడు ప్రయివేటు టెలికం సర్వీస్ ప్రొవైడర్లు ఉండాలని భావిస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల టెలికం రంగానికి భారీ ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఏజీఆర్ బకాయిలు ఉన్న టెల్కోలకు ఇది భారీ ఊరట కల్పించింది. ప్రభుత్వం నిర్ణయాన్ని టెల్కోలు స్వాగతించాయి.
వొడాఫోన్ ఐడియాకు స్థూలంగా రూ.1.91 లక్షల కోట్ల రుణాలు ఉన్నాయి. ఇందులో స్పెక్ట్రం కేటాయింపుల చెల్లింపుల కింద రూ.1.06 లక్షల కోట్లు, ఏజీఆర్ బకాయిల కింద రూ.62,180 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాలి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రూ.23,400కోట్ల బకాయి పడింది. బకాయిల చెల్లింపులు కష్టంగా మారడంతో ఓ దశలో వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వం కొంత వాటాను సొంతం చేసుకునే అవకాశముందని వార్తలు వచ్చిన నేపథ్యంలో టక్కర్ స్పందించారు.
అంతకుముందు, రవీందర్ టక్కర్ మాట్లాడుతూ... వొడాఫోన్ ఐడియా భవిష్యత్తుకు ఢోకా లేదని, పెట్టుబడిదార్లతో నిధుల సమీకరణ ఒప్పందాన్ని కుదుర్చుకుంటామన్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ఉపశమన చర్యలు కంపెనీకి దన్నుగా నిలుస్తాయన్నారు. ప్రస్తుతం వొడాఫోన్ ఐడియాకు రూ.1.91 లక్షల కోట్ల నికర రుణం ఉండగా, ప్రభుత్వానికి రూ.1.68 లక్షల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని, టెలికాం రంగంలో కనీసం మూడు ప్రయివేటు సంస్థలు ఉండే విధంగా ప్రభుత్వం తోడ్పాటు ఇవ్వడాన్ని ఇన్వెస్టర్లు గమనిస్తున్నారన్నారు. ప్రభుత్వ బకాయిలు చెల్లించడం కంటే వ్యాపార విస్తరణకు పెట్టుబడులు అవసరమన్నారు. ప్రభుత్వ ఉపశమన ప్యాకేజీతో కొంత వరకు భయాలు తొలగాయన్నారు.
వొడాఫోన్ ఐడియా నెట్ వర్క్ను వీడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జూలై నెలలో వొడాఫోన్ ఐడియాకు 14.3 లక్షలమంది యూజర్లు గుడ్ బై చెప్పారు. ఈ మేరకు ఇటీవల ట్రాయ్ నివేదిక వెల్లడించింది.