ఏడాదికి ఒక్కసారే రేట్లలో మార్పు: నిర్మలా సీతారామన్ సూచన
జీఎస్టీ రేట్ల మార్పుపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాదికి ఒక్కసారే జీఎస్టీ రేట్లలో మార్పు చేయడం మంచిదని అభిప్రాయపడ్డారు. ప్రతి మూడు నెలలకు ఓసారి రేట్లు సవరించే విధానం కంటే ఏడాదికి ఒక్కసారిసవరించడం మంచిదన్నారు. ఆమె కోల్కతాలో వ్యాపార, పారిశ్రామికవేత్తలతో మాట్లాడారు.
రుణాలు ఇవ్వకుంటే ఫిర్యాదు చేయండి: నిర్మలా సీతారామన్
మూణ్ణెళ్లకోసారి అయితే అనిశ్చితి
జీఎస్టీ మూడు నెలలకు ఓసారి సమీక్షించడం వల్ల ఇబ్బందులు ఉంటాయని నిర్మల అభిప్రాయపడ్డారు. జీఎస్టీ ద్వారా ఓ వస్తువుపై పన్ను తగ్గితే దానిని అమలు చేయడానికి సమయం తీసుకుంటుంది. అలాగే ఓ వస్తువుపై పన్ను తగ్గించినా పెంచినా ఇతరత్రా ప్రభావాలు కూడా ఉంటాయి. అలాగే, ఏడాదిలో జీఎస్టీ ఆదాయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కచ్చితంగా అంచనా వేయలేవు. ప్రతి మూడు నెలలకోసారి జీఎస్టీ కౌన్సిల్ భేటీ అయి ఆయా వస్తువులపై పెంపు లేదా తగ్గింపు వల్ల అనిశ్చితి నెలకొంటుందన్నారు.
బడ్జెట్లో మౌలిక వసతుల అభివృద్ధికి పునాది
5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు కావలసిన మౌలిక వసతుల అభివృద్ధికి తాము బడ్జెట్లో పునాది వేశామని నిర్మల చెప్పారు. డిమాండ్ - వినియోగం పెంచడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించేందుకు కావాల్సిన పెట్టుబడులను సమకూర్చుకోవడమే లక్ష్యంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో నిరాశ, నిస్పృహలను నివారించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించే 16 కార్యాచరణ ప్రణాళికలు కూడా ఆవిష్కరించామన్నారు.
పన్ను చెల్లింపుల్లో అవరోధం లేకుండా..
పన్ను చెల్లింపుల్లో ఇబ్బందులు, అవరోధాలు లేకుండా చూడటం కోసం తాము నిత్యం వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరుపుతామని నిర్మల చెప్పారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం బడ్జెట్లో చర్యలు తీసుకున్నామని చెప్పారు. గత మూడు నెలలుగా జీఎస్టీ కలెక్షన్లు రూ.1 లక్ష కోట్లు దాటుతున్నాయన్నారు. జనవరిలో ఈ కలెక్షన్లు రూ.1.11 లక్షల కోట్లు అన్నారు.