రైల్వే ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్, 78 రోజుల వేతన బోనస్
రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నాన్-గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని ఈ ఏడాది బోనస్గా ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 11.56 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ప్రభుత్వ ఖజానా పైన రూ.1,985 కోట్ల మేర భారం పడుతుంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ అద్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో బుధవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. రైల్వే ఉద్యోగులకు బోనస్ సహా పలు అంశాలను ఈ భేటీలో చర్చించారు. కేబినెట్ భేటీ అనంతరం కేంద్రమంత్రులు అనురాగ్ ఠాకూర్, పీయూష్ గోయల్ మీడియా సమావేశంలో కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు.
దేశవ్యాప్తంగా ఏడు మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అప్పారెల్ పార్క్స్ ఏర్పాటుకు కూడా కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపినట్లు పీయూష్ గోయల్ వివరించారు. రాబోయే అయిదేళ్ల కాలంలో రూ.4,445 కోట్లతో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో 7 లక్షల మందికి ప్రత్యక్షంగా, 14 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు.
ఈ నిర్ణయంతో 7 లక్షల మందికి ప్రత్యక్షంగా, 14 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పీపీపీ పద్ధతిలో ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అప్పారెల్ పార్క్స్ను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే పది రాష్ట్రాలు వీటి ఏర్పాటుకు ఆసక్తి చూపినట్లు తెలిపారు.