పెరుగుతున్న గోధుమ ధరలు, కేంద్రం కీలక నిర్ణయం: ఎగుమతులపై నిషేధం
దేశవ్యాప్తంగా గోధుమలు, వాటి ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. గోధుమల ఎగుమతుల పైన నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ లెటర్ ఆఫ్ క్రెడిట్ ఆధారంగా మే 13వ తేదీ నాటికి చేసుకున్న ఒప్పందాల మేరకు మాత్రం ఎగుమతులు కొనసాగుతాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ తెలిపింది. ఇతర దేశాల ఆఙార భద్రతను దృష్టిలో పెట్టుకొని ఆయా ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు ఎగుమతులను అనుమతించింది. ఇందుకు భారత ప్రభుత్వం అనుమతి తప్పనిసరి.
అందుకే పంట తక్కువ
గోధుమల ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్ రెండో స్థానంలో ఉంది. ఈ ఏడాది గోధుమ దిగుబడి గణనీయంగా తగ్గినట్లుగా తెలుస్తోంది. కేంద్రం ఇటీవల దిగుబడి అంచనాలను 5.7 శాతం తగ్గించి 105 మిలియన్ టన్నులుగా పేర్కొంది. పైగా సేకరణ విషయంలో ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యంలో సగం కూడా చేరుకునే అవకాశం లేదని గుర్తించింది. మే 13వ తేదీ నాటికి ఎఫ్సీఐ కేవలం 17 మెట్రిక్ టన్నులను మాత్రమే సేకరించింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది సగమే. దేశంలో వివిధ ప్రాంతాల్లో వీస్తున్న వేడి గాలులు పంట దిగుబడి దెబ్బతినడానికి కారణం. పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో ఎండలు ముందుగానే పెరిగాయి. ఇది పంట దిగుబడిపై ప్రభావం చూపింది.
అందుకే డిమాండ్
ప్రపంచంలో గోధుమల ప్రధాన ఎగుమతిదారుల్లో రష్యా మొదటి స్థానంలో, ఉక్రెయిన్ నాలుగో స్థానంలో ఉంది. యుద్ధం కారణంగా ఆ రెండు దేశాల నుండి ఎగుమతులు నిలిచిపోవడంతో భారత్ ఆ లోటును పూడ్చే ప్రయత్నాలు చేసింది. ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున ఆర్డర్లు వచ్చాయి. ఈ కారణంగా ఏప్రిల్ నెలలో గోధుమల ఎగుమతులు గరిష్టస్థాయికి చేరుకుంది. పలు అంతర్జాతీయ ఎగుమతి సంస్థలు రైతుల నుండి పెద్ద ఎత్తున గోధుమలను సేకరించి నిల్వ చేశాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎగుమతులు ప్రభుత్వస్థాయిలో జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.
95 మిలియన్ టన్నులకు పరిమితమయ్యే ఛాన్స్
జూన్ నెలతో ముగిసే పంటకాలంలో గోధుమల దిగుమతి 95 మిలియన్ టన్నులకు పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇది ప్రభుత్వం దృష్టికి రావడంతో చర్యలకు ఉపక్రమించారు. ఆలస్యం చేస్తే దేశ ఆహార భద్రత విషయంలో ఇబ్బందులు తప్పవని ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గోధుమల ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయంగా 35 మిలియన్ టన్నుల గోధుమల కొరత ఏర్పడబోతుందని అంచనాలు ఉన్నాయి.