కేంద్రం మరో కీలక అడుగు, ఏసీల దిగుమతిపై భారత్ నిషేధం: ఈ స్టాక్స్ జంప్
ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఇప్పటికే కలర్ టీవీ సెట్స్ను, టైర్లపై కఠిన ఆంక్షలు విధించిన భారత ప్రభుత్వం తాజాగా ఎయిర్ కండిషన్(ఏసీ)లపై నిషేధం విధించింది. దేశీయ తయారీని ప్రోత్సహించే ఉద్దేశ్యంలో భాగంగా ఈ చర్య తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ దేశీయంగా తయారీ విధానాన్ని ప్రోత్సహించేందుకు ఆత్మనిర్భర్ భారత్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కేంద్రం ఆ దిశగా ఒక్కో అడుగు వేస్తోంది. రిఫ్రిజిరేటర్లతో ఎయిర్ కండిషనర్ల దిగుమతి పాలసీని నిషేధిస్తున్నట్లు పేర్కొంది.
13 ఏళ్ల రికార్డ్కు బ్రేక్, రూ.3.28 లక్షల కోట్ల సంపద ఆవిరి: మూడీస్ హెచ్చరిక
ఏసీల దిగుమతిపై నిషేధం
దేశీయ తయారీని ప్రోత్సహించడం ద్వారా స్వావలంబన సాధించడానికి మన దేశం చేస్తోన్న ప్రయత్నాల్లో ఇది మరో అడుగు. ఇతర దేశాల నుండి ఏసీల దిగుమతి విధానాన్ని భారత్ నిషేధించిందని విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రధాని మోడీ ఆత్మనిర్భర్ భారత్ పిలుపు నేపథ్యంలో అత్యవసరమైన వాటిని తప్ప మిగతావాటి దిగుమతిని కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తోంది.
వివిధ రంగాలకు చెందిన కంపెనీలు కూడా అదే విధంగా ముందుకు సాగుతున్నాయి. దాదాపు 30 శాతం ఏసీలను ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నట్లు గతంలో ప్రధాని మోడీ తెలిపారు. వీలైనంత త్వరగా వీటిని తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలని ప్రధాని మోడీ జూన్ నెలలో వ్యాఖ్యానించారు.
స్థానిక తయారీ
దిగుమతి అవుతున్న వస్తువుల్లో ఏసీలను స్థానికంగా తయారు చేయగలిగిన వస్తువులుగా గుర్తించారు. 5 బిలియన్ల నుండి 6 బిలియన్ డాలర్ల వ్యాల్యూ కలిగిన ఏసీలు దేశంలోకి దిగుమతి అవుతున్నాయి. విడిభాగాలపరంగా 85 శాతం నుండి 100 శాతం వరకు దిగుమతి అవతున్నాయి.
ఈ స్టాక్స్ జంప్
ప్రభుత్వం నిర్ణయం నేపథ్యంలో వోల్టాస్ లిమిటెడ్, బ్లూస్టార్ లిమిటెడ్, హావెల్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీల స్టాక్స్ పెరిగాయి. బ్లూస్టార్ స్టాక్స్ నాలుగు శాతానికి పైగా, వోల్టాస్ షేర్ ధర 3 శాతానికి పైగా, హావెల్స్ షేర్ ధర దాదాపు రెండు శాతం ఎగిసింది. వోల్టాస్ షేర్లు పెద్ద ఎత్తున చేతులు మారాయి. మధ్యాహ్నం గం.2.37 సమయానికి హావెల్స్ షేర్ 696.85, వోల్టాస్ 694.15, బ్లూస్టార్ రూ.638.95 వద్ద ట్రేడ్ అయింది.