రూ.1లక్షా 70 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీ, రూ.50 లక్షల ఇన్సురెన్స్, 80 కోట్ల మందికి ఉచిత బియ్యం
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఆర్థిక ప్యాకేజీ తొలి ప్రకటన చేశారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోంది. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి అమెరికా 2 ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు యూఎస్ సెనెట్ బిల్లుకు ఆమోదం తెలిపింది. వివిధ దేశాలు ఆర్థిక ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్యాకేజీ ప్రకటిస్తామని, అది సిద్ధమవుతోందని రెండు రోజుల క్రితం నిర్మల ప్రకటించారు. ఈ మేరకు నేడు ప్రకటన చేశారు.
రూ.1 లక్షా 70వేల కోట్ల ప్యాకేజీ
దేశంలో ఆకలి చావులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. పేదలకు సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కరోనా ఆర్థిక ప్యాకేజీని రూ.1 లక్షా 70వేల కోట్లను ప్రకటించింది కేంద్రం. ఈ ఆర్థిక ప్యాకేజీని గరీబ్ కళ్యాణ్ పేరుతో ప్రకటించింది.
50 లక్షల ఇన్సురెన్స్
కరోనాతో పోరాటం చేస్తున్న డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ ఇన్సురెన్స్ పథకాన్ని ప్రకటించింది. వీరికి రూ.50 లక్షల ఇన్సురెన్స్ ప్రకటించింది. 20 లక్షల వైద్య బృందాలకు హెల్త్ ఇన్సురెన్స్ ప్రకటించారు.
80 కోట్ల మందికి 3 నెలలు ఉచిత ఫుడ్
కరోనా ప్రభావంతో ఉపాధి కోల్పోయిన వారికి ఆర్థిక సాయం ఇస్తామని నిర్మల తెలిపారు. పేదలు, రోజువారీ కూలీల కోసం ప్యాకేజీ ఇస్తున్నామన్నారు. ప్రజలెవరికీ ఆకలి బాధలు లేకుండా చేస్తామన్నారు. 80 కోట్ల మంది పేదలకు నెలకు 5 కిలోల బియ్యం లేదా గోదుమలు ఉచితంగా ఇస్తామన్నారు. దీనిని రానున్న మూడు నెలలు ఉచితంగా ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఇస్తున్న దానికి ఇది అదనంగా ఇస్తామన్నారు.