ఎయిర్టెల్లో పెట్టుబడుల ప్రవాహం: రూ.వేల కోట్ల ఇన్వెస్ట్
ముంబై: దేశీయ టాప్ టెలికం సర్వీస్ ప్రొవైడర్ భారతీ ఎయిర్టెల్ నక్కతోక తొక్కింది. వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడులను సాధించింది. ఇదివరకెప్పుడూ ఈ స్థాయిలో ఇన్వెస్ట్మెంట్స్ ఈ కంపెనీలో ప్రవహించలేదు. సెర్చింజిన్ దిగ్గజం గూగుల్.. ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయడానికి సన్నద్ధమైంది. ఈ విషయాన్ని భారతి ఎయిర్టెల్ వెల్లడించింది. వచ్చే అయిదు సంవత్సరాల కాలంలో దశలవారీగా గూగుల్.. బిలియన్ డాలర్ల మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తుందని పేర్కొంది.
భారత కంపెనీల్లో గూగుల్ భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టుడం కొత్తేమీ కాదు. ఇదివరకు రిలయన్స్ జియోలోనూ ఇన్వెస్ట్ చేసింది. దీని విలువ 33,737 కోట్ల రూపాయలు. మరిన్ని దేశీయ కంపెనీల్లోనూ స్టేక్స్ను కొనుగోలు చేసింది. జియో కస్టమర్ల కోసం 4జీ ఆధారిత స్మార్ట్ఫోన్స్ అభివృద్ధి చేయడానికి తనవంతు సహకారాన్ని అందించింది. తాజాగా తన వ్యాపార కార్యకలాపాల పరిధిని మరింత విస్తరింపజేసుకోగలిగింది.
ఒకే సెగ్మెంట్కు చెందిన కంపెనీల్లో గూగుల్.. వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టడం చర్చనీయాంశమైంది. దేశీయ టెలికం సెగ్మెంట్లో రిలయన్స్ జియో-ఎయిర్టెల్ మధ్య పోటీ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ రెండింట్లోనూ గూగుల్ పెట్టుబడులు పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్తో ఎయిర్టెల్లో 1.28 శాతం స్టేక్స్ను గూగుల్ దక్కించుకుంటుంది. ఎయిర్టెల్కు చెందిన 71,176,839 ఈక్విటీ షేర్లను గూగుల్ కొనుగోలు చేస్తుంది. ఒక్కో షేరుకు 734 రూపాయలను చెల్లిస్తుంది గూగుల్.
స్మార్ట్ ఫోన్స్, 5జీ సర్వీసులను అందుబాటులోకి తీసుకుని రావడం, ఇంటర్నెట్ వినియోగాన్ని పెంచుకోవడం, క్లౌడ్ సిస్టమ్ను మరింత అభివృద్ధి చేయడంపై ఈ రెండు కంపెనీలు కలిసి పని చేస్తాయి. ఇండియా డిజిటైజేషన్ ఫండ్లో భాగంగా గూగుల్.. తమ కంపెనీలో బిలియన్ డాలర్ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడానికి అంగీకరించిందని భారతి ఎయిర్టెల్ మేనేజ్మెంట్ తెలిపింది. గూగుల్ వంటి టాప్ సెర్చింజిన్తో కలిసి పని చేయడం వల్ల డిజిటల్ ఎకో సిస్టమ్కు మరింత ఊతమిచ్చినట్టవుతుందని పేర్కొంది.