ముందే దీపావళి: చక్రవడ్డీ మాఫీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్, ప్రభుత్వ ఖాజానపై 6500 కోట్ల భారం
న్యూఢిల్లీ: వరుస పండగల పురస్కరించుకుని రుణ గ్రహీతలకు కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పండగ కానుకలా మారింది. మారటోరియం కాలానికి రూ. కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీ మాఫీ చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో ఆర్బీఐ మారటోరియం స్కీం కింద ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా శనివారం విడుదల చేసింది. కరోనా విపత్కర పరిస్థితుల దృష్ట్యా వీలైనంత త్వరగా చక్రవడ్డీ అంశంపై నిర్ణయం తీసుకోవాలని, సామాన్యుల దీపావళి మీ చేతుల్లోనే ఉందని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. కాగా, వడ్డీ మాఫీ కారణంగా ప్రభుత్వ ఖజానాపై రూ. 6500 కోట్ల భారం పడనుంది.
తాజాగా ప్రకటించిన కేంద్ర మార్గదర్శకాల ప్రకారం.. గృహ రుణాలు, విద్య, వాహన, ఎంఎస్ఎంఈ, వినియోగవస్తువుల కొనుగోలు రుణాలు, వినియోగ రుణాలు వంటివి ఈ పథకం పరిధిలోకి వస్తాయి. అయితే, ఈ రుణం వర్తించాలంటే ఫిబ్రవరి 29 నాటికి సదరు ఖాతా ఎన్పీఏగా గుర్తించి ఉండకూడదు.
సాధారణ వడ్డీకి, చక్రవడ్డీకి ఉన్న తేడాను రుణ విక్రేతలు (బ్యాంకులు, ఆర్థిక సంస్థలు) రుణ గ్రహీతల ఖాతాల్లో జమ చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మొత్తాన్ని కేంద్రం రీఎంబర్స్ చేస్తుందని తెలిపింది. మార్చి 1 నుంచి ఆగస్టు 31 వరకు ప్రకటించిన మారటోరియం కాలానికి ఈ పథకం వర్తిస్తుందని పేర్కొంది. మారటోరియంపై విచారణను సుప్రీంకోర్టు నవంబర్ 2కు వాయిదా వేసిన నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు ముందే స్పందించింది.