గుడ్న్యూస్: తగ్గనున్న కారు, బైకు ధరలు..ఆ ఆదేశాలను ఉపసంహరించుకున్న ఐఆర్డీఏ
ముంబై: కారు కొనాలనుకుంటున్నారా...? అమ్మో ధర ఎక్కువుంటుందేమో అని భయపడుతున్నారా.. ఇప్పుడు ఆ బెంగ బెడద అక్కర్లేదు. ఎందుకంటే కారు ధరలు తగ్గనున్నాయి. అయితే తగ్గిన ధరలతో కొత్త కారు కొనుగోలు చేయాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే. అంటే ఆగష్టు 1 నుంచి తగ్గిన ధరలతో కారును మీ సొంతం చేసుకోవచ్చు.
తగ్గనున్న కారు మరియు ద్విచక్రవాహనాలు
కొత్త కారు కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది ఒక గుడ్న్యూస్. కొత్త కారు ఆన్ రోడ్ ధర తగ్గింది. కారు కొనుగోలు సమయంలో ఫలానా సమయం వరకు కట్టే ఇన్ష్యూరెన్స్ డబ్బులు ఇప్పుడు ఒక ఏడాది వరకు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని ఇన్ష్యూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా పేర్కొంది. దీర్ఘకాలిక ఇన్ష్యూరెన్స్ ప్యాకేజీలను ఐఆర్డీఏ ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొంది. అసలే కరోనా కష్టకాలంలో వాహనాల సేల్స్ తగ్గిన నేపథ్యంలో కొనుగోలుదారులకు తీపి కబురు చెప్పింది ఐఆర్డీఏ. ఇక దీర్ఘకాలిక ఇన్ష్యూరెన్స్ ప్యాకేజీ తీసుకోవాలని కస్టమర్ భావించినప్పటికీ అది సాధ్యం కాదు. ఎందుకంటే ఆ ఆప్షన్ను తీసేసింది ఐఆర్డీఏ. అయితే కొత్త వాహన కొనుగోలుదారులు మాత్రం ఒక ఏడాది పాటు డ్యామేజ్ పాలసీకి సంబంధించి సమగ్ర బీమాకోసం చెల్లించాలని అదే సమయంలో థర్డ్ పార్టీ బీమా కారుకు అయితే మూడేళ్లు, ద్విచక్రవాహనంకు అయితే ఐదేళ్లు తప్పని సరి అని పేర్కొంది.
కష్ట కాలంలో ఊరటనిచ్చే వార్త చెప్పిన ఐఆర్డీఏ
ఏది ఏమైనప్పటికీ ఇలాంటి కష్ట సమయంలో కొనుగోళ్ల విషయంలో స్వల్ప ఊరట కూడా లబ్ధి చేకూర్చినట్లే అవుతుందని పలువురు ఆటోమోటివ్స్ యాజమాన్యాలు అభిప్రాయపడ్డాయి. బీమా రెన్యువల్, ఇతరత్ర విషయాలపై ఈ సమయంలో కస్టమర్లు ఇబ్బంది పడతారని కానీ తాజా నిర్ణయంతో కాస్త ఊరట లభించినట్లయ్యిందని వెల్లడించారు. ఒక ఏడాది తర్వాత ఇన్ష్యూరెన్స్ కంపెనీని మార్చాలనుకుంటే అది పెద్ద సవాలుగా మారేదని ఎందుకంటే ఐదేళ్లు ఒకే ఇన్ష్యూరెన్స్ సంస్థలో లాక్ ఇన్ పీరియడ్ ఉండేది. ఇప్పుడు నూతన విధానంతో అలాంటి సమస్యలు ఉండవని నిపుణులు చెబుతున్నారు.
2018లో సుప్రీంకోర్టు తీర్పు
దీర్ఘకాలిక మోటార్ వెహికల్ ఇన్ష్యూరెన్స్ ప్లాన్లను ఉపసంహరించుకునేలా ప్రణాళిక సిద్ధం చేయాలని ఐఆర్డీఏ గత నెల జూన్లో భావించింది. 2018లో సుప్రీంకోర్టు తప్పనిసరిగా దీర్ఘకాలిక ఇన్ష్యూరెన్స్ కలిగి ఉండాలని సూచించడంతో అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను అదే ఏడాది సెప్టెంబర్లో ఐఆర్డీఏ అమలు చేసింది. అంటే వాహనం సొంత డ్యామేజీతో పాటు థర్డ్ పార్టీ ఇన్ష్యూరెన్స్ ఒకేసారి తీసుకోవాలని సూచించింది. ఈ లెక్క ప్రకారం కార్లకు అయితే మూడేళ్లు, ద్విచక్రవాహనాలకు అయితే ఐదేళ్లుగా ఫిక్స్ చేసింది.
2018 నుంచి తగ్గిన కార్ల అమ్మకాలు
ఆటో ఇండస్ట్రీ సేల్స్ గణనీయంగా పడిపోతున్న సమయంలో ఐఆర్డీఏ ఊరటనిచ్చే వార్తను ఇచ్చింది. సెప్టెంబర్ 2018 నుంచి వాహన సేల్స్ క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. అదేసమయంలో తప్పనిసరిగా ఇన్ష్యూరెన్స్ ఐదేళ్లు తీసుకోవాలని ఐఆర్డీఏ చెప్పడంతో సేల్స్ మరింత పడిపోయాయి. 2019లో వాహన అమ్మకాలు మరింత క్షీణించాయి. దీంతో ఆటో మొబైల్ ఇండస్ట్రీ అత్యంత గడ్డుకాలాన్ని ఎదుర్కొంది. అయితే 2020లో BS6 నిబంధనలు అమలు చేస్తుండటంతో వాహనాల అమ్మకాలు పుంజుకుంటాయని అంతా భావించిన నేపథ్యంలో కరోనావైరస్ మహమ్మారి ఆ ఆశలపై నీళ్లు చల్లింది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో కారు కొనుగోలు చేయాలకునే వారు ముందుకొస్తారని ఆటో ఇండస్ట్రీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.