భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటోంది: మూడీస్ తర్వాత గోల్డ్మన్ శాక్స్ అంచనా
కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్యాకేజీ, చర్యలు భారత ఆర్థిక వ్యవస్థ వేగవంత రికవరీకి తోడ్పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పలు రేటింగ్ ఏజెన్సీలు భారత్ వేగంగా కోలుకుంటోందని చెబుతున్నాయి. తాజాగా గోల్డ్మన్ శాక్స్ కూడా భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటుందని వెల్లడించింది.
2020-21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ క్షీణత 10.3 శాతం ప్రతికూలత, 2021-22 ఆర్థిక సంవత్సరంలో 13 శాతం వృద్ధి నమోదు చేయవచ్చునని పేర్కొంది. ఇటీవల మూడీస్ ఇన్వెస్టర్స్ కూడా భారత్లో వేగంగా కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయని పేర్కొంటూ, పూర్తి సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాలను సవరించింది.
కరోనా పూర్వస్థాయి కంటే..
గోల్డ్మన్ శాక్స్ గతంలో భారత వృద్ధి రేటును మైనస్ 14.8 శాతంగా అంచనా వేయగా, తాజాగా మైనస్ 10.3 శాతానికి సవరించింది. వచ్చే ఏడాది మైనస్ 15.7 శాతంగా ఉండవచ్చునని తొలుత అంచనా వేసింది. ఇప్పుడు దీనిని 13 శాతానికి తగ్గించింది. వ్యాక్సీన్ అందుబాటులోకి రావడం, 2022 ఏడాది మిడిల్ నాటికి కరోనా నియంత్రణలోకి వచ్చే అవకాశాలు ఉండటంతో వృద్ధి రేటు పుంజుకుంటుందని పేర్కొంది. అన్ని రంగాల్లోను కార్యకలాపాలు వేగంగా పుంజుకుంటున్నాయని, ప్రధానంగా కన్స్యూమర్ ఫేసింగ్ సర్వీసెస్ సెక్టార్ వేగవంతమవుతోందని తెలిపింది. కరోనా పూర్వస్థాయి కంటే ఆశాజనకంగా ఉన్నట్లు తెలిపింది.
కార్యకలాపాలు ఆశాజనకం
ఇటీవల జీఎస్టీ కలెక్షన్లు, ఐఐపీ (ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, పీఎంఐ ఆశాజనకంగా ఉన్నాయి. అక్టోబర్ నెలలో పీఎంఐ 58.9తో 13 ఏళ్ళ గరిష్టాన్ని తాకింది. కరోనా అనంతరం సర్వీసెస్ పీఎంఐ 54.1ని తాకింది. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్న నేపథ్యంలో ఆర్బీఐ కూడా వృద్ధిరేటును మైనస్ 9.5 శాతానికి తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు సున్నాకు దగ్గరగా ఉండవచ్చునని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రభుత్వం ఉద్దీపన వల్ల మరింత పుంజుకునేలా కనిపిస్తోందని పేర్కొంది.
గతంలో మూడీస్...
భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ ఇటీవల వెల్లడించింది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం సుదీర్ఘ లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆర్థిక కార్యకలాపాలు పూర్తగా నిలిచిపోయి 2020లో జూన్ త్రైమాసికంలో వృద్ధి రేటు 23.9 శాతం క్షీణించింది. అయితే అన్-లాక్ తర్వాత ఆర్థిక కార్యకలాపాలు వేగంగా పుంజుకుంటున్నాయి.
దీంతో పూర్తి సంవత్సరానికి జీడీపీని మూడీస్ సవరించింది. గతంలో కంటే కాస్త ఆశాజనకంగా పేర్కొంది. గ్లోబల్ మాక్రో అవుట్ లుక్ 20201-22 పేరుతో రూపొందించిన నివేదికలో ఈ ఏడాది జీడీపీ మైనస్ 8.9 శాతం క్షీణత నమోదు చేయవచ్చునని మూడీస్ అంచనా వేసింది. గతంలో మైనస్ 9.6 శాతంగా పేర్కొంది. గత అంచనాతో పోలిస్తే తాజా అంచనా మెరుగు. అంటే ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.