రూ.550 నుంచి రూ.1,200 వరకు...: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
న్యూఢిల్లీ: రికార్డ్ ధరతో దూసుకెళ్తున్న బంగారం ధరలు మంగళవారం నాడు భారీగా తగ్గిపోయాయి. దసరా, దీపావళి, ధన్తెరాస్ సమయంలో సాధారణంగా సేల్స్ ఎక్కువగా ఉంటాయి. ట్రేడర్స్ ఊహించిన దాని కంటే రెండింతలు సేల్స్ పెరిగినప్పటికీ, గత ఏడాది కంటే మాత్రం పసిడి అమ్మకాలు తగ్గాయి. రెండు రోజుల క్రితం వరకు 39 వేలకు పైగా ఉన్న బంగారం ధర మంగళవారం (అక్టోబర్ 29) ఏకంగా రూ.548 వరకు తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం 38,857కు పడిపోయింది. కిలో వెండి ధర రూ.1,190 తగ్గి రూ.47,090కి చేరుకుంది.
ఆర్డర్లతో అమెజాన్తో ఆటాడుకున్న విద్యార్థులు, రూ.కోట్ల నష్టం
భారీగా తగ్గిన బంగారం, వెండి ధర
ఎంసీఎక్స్లో గోల్డ్ ఫ్యూచర్ మంగళవారం సాయంత్రం 10 గ్రాముల బంగారం 0.2 శాతం తగ్గి రూ.37,860గా ఉంది. అంతకుముందు రోజు.. సోమవారం 0.1 శాతం తగ్గింది. గత రెండు మూడు నెలలుగా బంగారం ధరలు రూ.40,000 దగ్గరగా ఉంటున్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ మార్క్ దాటేశాయి. వెండి రూ.50 వేలు దాటింది. ఇటీవల బంగారం, వెండి కాస్త దిగి వచ్చాయి. మొత్తానికి మంగళవారం బంగారం రూ.550 వరకు, వెండి రూ.1,200 వరకు తగ్గడం గమనార్హం.
అంతర్జాతీయ మార్కెట్లో....
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఫ్లాట్గా ఉన్నాయి. స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 1,491.87 డాలర్లుగా ఉంది. అంతకుముందు సోమవారం రోజు అమెరికా మార్కెట్లో దీని ధర 0.8 శాతం తగ్గింది. చైనా - అమెరికా డీల్ ప్రతిష్టంభన నేపథ్యంలో ఇటీవల రికార్డ్ ధరకు చేరుకున్న తర్వాత కాస్త దిగి వస్తోంది. బంగారం ఔన్సుకు 1500 డాలర్ల నుంచి 1525 డాలర్ల మధ్య తచ్చాడుతోందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తెలిపింది.
దీపావళి తర్వాత తగ్గిన డిమాండ్
పారిశ్రామిక వర్గాల నుంచి, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో వెండి ధర ఏకంగా రూ.1,190 తగ్గింది. అంతకుముందు ఇది రూ.48,280గా ఉండగా, మంగళవారం రూ.47,090గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న మందకొడి పరిస్థితులు కూడా ఇక్కడ ధరలు భారీగా తగ్గిపోవడానికి కారణం. దీపావళి తర్వాత డిమాండ్ అంతంత మాత్రంగానే ఉంటుందని గతంలోనే అంచనా వేసినట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. అమెరికా-చైనా దేశాల మధ్య జరుగుతున్న చర్చలు ఆశావాదంగా ఉన్నప్పటికీ అతి విలువైన లోహాలపై తీవ్ర ఒత్తిడి ఉందన్నారు.