రూ.4,000 డౌన్! భారీగా తగ్గిన బంగారం ధర, 1983 తర్వాత ఇంతలా తగ్గడం ఇదే మొదటిసారి
బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా, భారత్లో పసిడి ధరలు తగ్గాయి. శనివారం ఇటీవలి కాలంలో తగ్గనంత భారీ మొత్తంలో తగ్గాయి. ఎంసీఎక్స్లో 10 గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ శుక్రవారం నాటి ముగింపుతో పోల్చుకుంటే రూ.1,800 (4.25 శాతం) తగ్గి రూ.40,416 వద్ద ట్రేడ్ అయింది. వెండి ధర కూడా భారీగానే పడిపోయింది. ఎంసీఎక్స్లో కిలో రూ.3,679 (8 శాతం) పడిపోయి రూ.40,460 వద్ద ట్రేడ్ అయింది.
కరోనా షాక్: అమ్మో! ఈ బంగారం మాకు వద్దు.. ఇన్వెస్టర్లు దూరం
రూ.4వేలు తగ్గిన బంగారం
అంతకుముందు, గత వారంలో బంగారం ధర 10 గ్రాములకు రూ.45,000 మార్క్ దాటింది. వారాంతంలో రూ.40వేలకు పైగా ఉంది. అంటే వారంలో దాదాపు రూ.4వేలకు పైగా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోను ఔన్స్ బంగారం 1,700 డాలర్లను దాటింది. ప్రపంచ మార్కెట్లు కుప్పకూలుతుండటం, క్రూడాయిల్ ధరలు పడిపోతుండటంతో మార్కెట్లు, చమురు సంస్థలు భారీ నష్టాల్లోకి వెళ్లాయి. దీంతో అంతకుముందు చాలామంది సురక్షిత బంగారం వంటి ఖరీదైన లోహాలపై ఇన్వెస్ట్ చేస్తున్నారు.
ఇన్వెస్టర్ల ఆందోళన
ఇన్వెస్టర్లు అందరు బంగారంపై పెట్టుబడి పెట్టడంతో క్రమంగా పెరిగింది. అయితే కరోనా వైరస్ కారణంగా ప్రపంచ మార్కెట్లు, ఆ తర్వాత రష్యా - సౌదీ చమురు ధరల యుద్ధం కారణంగా ఇంధన సంస్థలు నష్టాల్లోకి వెళ్ళిపోయాక.. బంగారం అదేపనిగా పెరుగుతుండటంతో.. ముందు ముందు నిలకడగా ఉండదని ఇన్వెస్టర్లు భావించారు. దీంతో బంగారం బదులు నగదు రూపంలో దాచుకునేందుకు ఆసక్తి కనబరిచారు. దీంతో బంగారం కొనుగోళ్లు తగ్గాయి. అంతేకాదు బంగారంపై చేసిన ఇన్వెస్ట్ను కూడా కొంతమంది వెనక్కి తీసుకున్నారు. ఈ ప్రభావం పడి, ధర తగ్గింది.
1983 తర్వాత ఓ వారంలో తగ్గుదల రికార్డ్
గత వారం ఓ సమయంలో బంగారం ఔన్స్ 1700 డాలర్లు దాటింది. కానీ పరిస్థితులు అనుకూలంగా లేవని గ్రహించిన ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడిని పక్కన పెట్టారు. దీంతో శనివారం న్యూయార్క్లో ఔన్స్ స్పాట్ గోల్డ్ 2.9 శాతం తగ్గి 1,529.83 డాలర్లకు చేరుకుంది. గత వారం ప్రారంభంలోని ధరతో పోలిస్తే ముగిసిన ధర చూస్తే 8.6 శాతం మేర తగ్గింది. తగ్గుదల పది శాతానికి దగ్గరలో ఉంది.
అతివిలువైన బంగారం సహా అన్నింటి ధరలు..
ఓ వారంలో బంగారం ధర 8.9 శాతం తగ్గడం మార్చి 1983 తర్వాత మళ్లీ ఇప్పుడేనని నిపుణులు చెబుతున్నారు. న్యూయార్క్ కామెక్స్లో ఫ్యూచర్లో బంగారం 2011 తర్వాత తొలిసారి భారీ తగ్గింపు నమోదు చేసింది. వెండితో పాటు పల్లాడియం, ప్లాటినం కూడా ఇన్వెస్టర్లకు ఆందోళన కలిగిస్తోంది.
పెట్టుబడి సురక్షితం కాదనేనా?
ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం కూడా సురక్షిత పెట్టుబడి అంశం కాదని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. అన్నీ సర్దుకుంటే బంగారం ధరలు తగ్గే అవకాశాలు ఉంటాయని ఇన్వెస్టర్లను భయానికి గురి చేస్తున్నాయి. కరోనా, మార్కెట్లు, ఇంధనం.. ఇలా అన్నీ బంగారం ధరను అనూహ్యంగా పెంచాయి. కానీ భవిష్యత్తులో ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు.