బ్యాంకుల్లో తక్కువ వడ్డీ రేట్లతో గోల్డ్ లోన్స్ ... కరోనా ఆర్ధిక ఇబ్బందుల నుండి ఊరట !!
కరోనా వ్యాప్తిని నివారించడానికి విధించిన లాక్ డౌన్ తో నాటినుండి నేటి వరకు ప్రజల ఆర్థిక కష్టాలు ఇంత అని చెప్పడానికి వీలు లేకుండా ఉన్నాయి. మూడు నెలల పాటు ఇళ్లకే పరిమితమై ఏ పని చేయకుండా, ఉన్న కొద్దిపాటి డబ్బు ఖర్చు పెట్టుకున్న మధ్యతరగతి సగటు జీవులు ఇప్పుడు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. అయితే కరోనా కష్టకాలంలో బ్యాంకులు సాధ్యమైనంతగా ప్రజలకు రుణాలిచ్చి ఆదుకోవాలని ఆర్బిఐ చేసిన సూచనల మేరకు బ్యాంకులలోతక్కువ వడ్డీ రేట్లకు బంగారంపై రుణాలు ఇస్తున్నారు. ప్రస్తుతం గతంతో పోల్చితే ఇప్పుడు బంగారంపై రుణాలు తీసుకునే వారు చాలావరకు పెరిగారు.
కరోనా లాక్ డౌన్ ప్రభావంతో అటు ఉద్యోగాలు చేసేవారు, ఇటు వ్యాపారాలు చేసేవారు అందరూ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారు. బయట ప్రైవేటుగా అప్పు దొరికే పరిస్థితులు కూడా లేకుండాపోయాయి.దీంతో ఆర్ధిక సమస్యల నుంచి గట్టెక్కడానికి బంగారంపై రుణాల కోసం పరుగులు పెడుతున్నారు మధ్య తరగతి ప్రజలు. అటు ప్రభుత్వ రంగ బ్యాంకులలోనే కాకుండా,ప్రైవేటు బ్యాంకులు కూడా కాస్తో కూస్తో వడ్డీ తక్కువగా ఉండటంతో అందరూ బంగారంపై రుణాలు తీసుకుంటున్నారు. బంగారంపై రుణాలను 7.65 శాతం వడ్డీకే ప్రభుత్వ రంగ బ్యాంకులు గోల్డ్ లోన్ మేళాలు నిర్వహించి మరీ ఇస్తుండడంతో చాలామంది బ్యాంకులకు పరుగులు పెడుతున్నారు.
కేవలం అరగంటలోనే ప్రతిరోజు గోల్డ్ లోన్స్ ఇస్తున్న పరిస్థితి బ్యాంకులలో కనిపిస్తుంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో 38 శాతం మంది అదనంగా గోల్డ్ లోన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గతంలో సగటున ఒక బ్యాంకులో రోజుకు ఆరు నుండి పది మంది రుణాలు తీసుకోగా, ఇప్పుడు ఈ సంఖ్య 8 నుండి 12 కు పెరిగిందని చెప్తున్నారు. ఏదేమైనా ఎడారిలో ఒయాసిస్సులా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నవారికి గోల్డ్ లోన్స్ మాత్రం ఆర్థిక భరోసా అందిస్తున్నాయి. కరోనా కష్టకాలంలో ఆదుకుంటున్నాయి.