ఒమన్ సుల్తాన్ మృతి: క్యాన్సిలేషన్, రీషెడ్యూల్ ఫీజు రద్దుచేసిన గోఎయిర్
జనవరి 14వ తేదీ వరకు ఒమన్కు ప్రయాణించే విమానాలలో క్యాన్సిలేషన్ ఫీజును, రీషెడ్యూలింగ్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు గోఎయిర్ ఆదివారం ప్రకటించింది. ఒమన్ సుల్తాన్ మరణం తర్వాత అక్కడి పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది.
ఒమన్ సుల్తాన్ అల్ సయీద్ అంతిమ సంస్కారాలకు వచ్చే వారితో మస్కట్ ఎయిర్ పోర్ట్ తీవ్రమైన రద్దీ నెలకొనే అవకాశముందని, రానున్న మూడు రోజులు ఇదే పరిస్థితి ఉండవచ్చునని, కాబట్టి ఒమన్ సర్వీసుల్లో క్యాన్సిలేషన్ ఛార్జీలు, రీషెడ్యూల్ ఛార్జీలను ఎత్తివేసినట్లు గోఎయిర్ తన ప్రకటనలో తెలిపింది.
ఒమన్ దేశానికి చెందిన సుల్తాన్ కాబూస్ బిన్ సయీద్ ఆల్ సయీద్ 79 ఏళ్ల వయస్సులో శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఆధునిక అరబ్ ప్రపంచ నిర్మాతగా ఆయనకు పేరు ఉంది. 1970లో తన తండ్రిని పదవి నుంచి తొలగించి 29 ఏళ్లకే అధికారం చేజిక్కించుకున్నారు. ఐదు దశాబ్దాల పాటు పాలించారు.