జీఎంఆర్ ఇన్ఫ్రా: ఆదాయం పెరిగింది.. లాభమూ వచ్చింది, అయినా...
ఈ ఏడాది సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ రూ.457 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో ఈ నష్టం రూ.334 కోట్లే. ఇదే త్రైమాసికానికి ఆదాయం రూ.2,025.72 కోట్ల నుంచి రూ.2,164.26 కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధానికి రూ.4,370.17 కోట్ల ఆదాయంపై రూ.794.62 కోట్ల నష్టాన్ని చవి చూసింది.
అయ్యో.. ఎందుకిలా? ఆదాయం ఏమైనా తగ్గుతోందా? అంటే అదేం కాదు. గత ఏడాది ఇదే త్రైమాసికం ఆదాయం రూ.1,904 కోట్లతో పోల్చితే ఈ ఏడాది రెండో త్రైమాసికం ఆదాయం మరింత పెరిగి రూ.2,018 కోట్లకు పెరిగింది. విమానాశ్రయాల విభాగం నుంచి ఆదాయం రూ.1,315 కోట్ల నుంచి రూ.1494 కోట్లకు పెరగగా.. లాభం కూడా రూ.88 కోట్ల నుంచి రూ.135 కోట్లకు చేరింది.
విద్యుత్ రంగం నుంచి ఆదాయం రూ.178 కోట్ల నుంచి రూ.167 కోట్లకు తగ్గింది. ఇక ఢిల్లీ విమానాశ్రయంలో ప్రయాణికులు రద్దీ ఏడాది పొడవునా మార్పు లేకుండా 1.73 కోట్లుగా ఉంది. పైగా ఈ ఏడాది తొలి త్రైమాసికంతో పోలిస్తే.. రెండో త్రైమాసికంలో ప్రయాణికుల రద్దీ 10 శాతం పెరిగింది. జెట్ ఎయిర్వేస్ ప్రభావం తగ్గుముఖం పట్టినట్లేనని, ఈ ఎయిర్పోర్టు లాభం రూ.135 కోట్లకు చేరిందని జీఎంఆర్ ఇన్ఫ్రా పేర్కొంది.
హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ 3 శాతం పెరిగి 54 లక్షలకు చేరింది. ఇక్కడ కూడా లాభం రూ.217 కోట్లకు పెరిగింది. జీఎంఆర్ గ్రూప్ పోర్ట్ఫోలియోలోని ఎయిర్పోర్టులకు మొత్తం 15.9 కోట్ల ప్రయాణికుల సామర్థ్యం ఉంది. దేశంలోనే బిజీగా ఉండే ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, హైదరాబాద్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుతోపాటు ఫిలిప్పైన్స్లోని మక్టన్ సెబు ఎయిర్పోర్టుల నిర్వహణ కూడా జీఎంఆర్ గ్రూప్ చేతుల్లోనే ఉన్నాయి.
ఫిలిప్పైన్స్లోనే మరో ఎయిర్పోర్టు ప్రాజెక్టును కూడా క్లార్క్ ఇంటర్నేషనల్ భాగస్వామ్యంతో తాము చేజిక్కించుకున్నట్లు జీఎంఆర్ ఇన్ఫ్రా తెలిపింది. అలాగే నాగ్పూర్ ఎయిర్పోర్టు డెవలప్మెంట్కు ఇటీవలే లెటర్ ఆఫ్ ఇంటెంట్ వచ్చిందని, ఢిల్లీ, హైదరాబాద్ ఎయిర్పోర్టులకు పక్కన ఎయిర్పోర్టు సిటీలనూ తాము డెవలప్ చేస్తున్నామని కంపెనీ పేర్కొంది. అంతేకాదు, ఆంధ్ర్రప్రదేశ్లోని విశాఖపట్నం సమీపంలో తలపెట్టిన భోగాపురం ఎయిర్పోర్టు ప్రాజెక్టుకు జీఎంఆర్ ఇన్ఫ్రాయే అత్యధిక బిడ్డర్.
రుణాలను తగ్గించుకోవడానికి, ఆస్తి, అప్పుల పట్టికను పటిష్ఠం చేసుకోవడానికి విమానాశ్రయాల వ్యాపారంలో వాటాను విక్రయించడంపై దృష్టి పెట్టనున్నట్లు కంపెనీ వెల్లడించింది. అప్రాధాన్య ఆస్తుల్లో వాటా విక్రయించాలని భావిస్తోంది. జీఎంఆర్ చత్తీస్గఢ్ ఎనర్జీలో నూరు శాతం వాటా విక్రయం పూర్తయిందని,. జేవర్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఫైనాన్షియల్ బిడ్ను సమర్పించిందని జీఎంఆర్ ఇన్ఫ్రా తెలిపింది.
అలాగే జీఎంఆర్ నిర్మించి, నిర్వహిస్తోన్న విమానాశ్రయాల్లో 44.44 శాతం వాట విక్రయించేందుకు కీలక నియంత్రణా సంస్థల నుంచి అనుమతులు కూడా లభించాయని జీఎంఆర్ ఇన్ఫ్రా స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది. టాటా గ్రూప్, ఎస్ఎస్జీ క్యాపిటల్ మేనేజ్మెంట్, సింగపూర్కు చెందిన సార్వభౌమ వెల్త్ఫండ్ జీఐసీలతో కూడిన కన్సార్టియం ఈ వాటాను కొనుగోలు చేయనుంది.