IT portal glitch: నెల రోజులు దాటిన కొత్త ఐటీ పోర్టల్లో సమస్యలు
రిటర్న్స్ సులువుగా దాఖలు చేసేందుకు గత నెల ఎనిమిదో తేదీన ఆదాయపు పన్ను శాఖ మార్పులతో కొత్త వెబ్సైట్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కొత్త వెబ్ సైట్ అందుబాటులోకి వచ్చి నెల రోజులు దాటింది. అయినప్పటికీ సమస్యలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. కొత్త వెబ్ సైట్లో సమస్య తలెత్తుతోందని నెటిజన్లు, సీఏలు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించాలని ఇన్ఫోసిస్కు సూచించింది. ఈ అంశంపై ఇన్ఫోసిస్ కూడా స్పందించింది. సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపింది. కొన్నింటిని పరిష్కరించామని, మిగతా వాటిని చూస్తున్నట్లు ఇన్ఫోసిస్కు చెందిన నందన్ నీలేకని ఇటీవల చెప్పారు.
ఈ వివరాల్లేవు
కొత్త ఐటీ పోర్టల్లో సమస్యలు పూర్తిగా ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ఇప్పటికీ ఈ-ప్రొసీడింగ్స్, డిజిటల్ సిగ్నేచర్కు సంబంధించిన సమస్యలు అలాగే ఉన్నాయని పలువురు సీఏలు చెబుతున్నారు. విదేశీ సంస్థలు కూడా ఈ వెబ్సైటులోకి లాగ్-ఇన్ కావడానికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని చెబుతున్నారు. ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులు తమ పాత రిటర్న్స్ చూసుకోలేకపోతున్నట్లు తెలిపారు. సెక్షన్ 14(1) కింద వచ్చిన పాత ఇంటిమేషన్ నోటీసులు కనిపించడం లేదన్నారు. వివాద్ సే విశ్వాస్ పథకానికి సంబంధించిన వివరాల్లేవు.
అవి అప్ లోడ్ చేయలేక ఇబ్బంది
విదేశీ ద్రవ్య మారకానికి సంబంధించిన ఫామ్ 15CA/CBలు ఇంకా వెబ్సైటులోకి అప్లోడ్ చేయలేకపోతున్నారు. ఇన్ఫోసిస్ కూడా సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఐటీఆర్ ఫైలింగ్, ఐటీ పోర్టల్ లాగ్-ఇన్ సమస్యల పరిష్కారానికి ఇన్ఫోసిస్ సంస్థతో కలిసి పని చేస్తున్నట్లు ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది.
నాటి నుండి సమస్యలు
జూన్ 7వ తేదీన కొత్త ఐటీ పోర్టల్ను ఆవిష్కరించారు. అయితే, నాటి నుండి సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. పోర్టల్ను రూపొందించిన ఇన్ఫోసిస్తో వీటిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా సమీక్ష జరిపి దాదాపు 2 వారాలు అయినప్పటికీ కష్టాలు తీరలేదు. ఇండస్ట్రీ చాంబర్ PHDCCI డైరెక్ట్ ట్యాక్సెస్ కమిటీ చైర్మన్ ముకుల్ బాగ్లా మాట్లాడుతూ.. సాధారణ పన్ను పరిపాలనతో పాటు పన్నురిటర్న్ ఫైలింగ్లో సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.