ghmc tax fraud: అలా పన్ను చెల్లించిన వారిపై GHMC ఆగ్రహం.. FIR నమోదుకు రంగం సిద్ధం
ghmc tax fraud: గతేడాది ఆస్తిపన్ను చెల్లింపుల్లో చోటుచేసుకున్న మోసాలపై చర్యలు తీసుకునేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిద్ధమవుతోంది. ఆస్తిపన్ను గుర్తింపు సంఖ్యను (PTIN) పొందేందుకుగాను.. నోటరీల వంటి చెల్లని పత్రాలను సమర్పించిన వారిపై చర్యలు తీసుకోవడానికి రంగంలోకి దిగింది. నోటరీ ఆస్తిని రిజిస్టర్డ్ గా మార్చిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని నిర్ణయించింది .
ఫేక్ పత్రాల అప్ లోడ్:
'ఆస్తి పన్ను స్వీయ అసెస్మెంట్' విధానాన్ని GHMC గతేడాది అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే అందులోని లొసుగులను వినియోగించుకుని పలువురు మోసాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఆన్లైన్లో జనరేట్ అయిన ఆస్తి పన్నును తగ్గించడానికి.. నోటరీల వంటి చెల్లని పత్రాలను అప్ లోడ్ చేశారు. తద్వారా జనరేట్ అయిన ఆస్తిపన్ను ఆధారంగా అనధికార స్థలాలను సైతం రిజిస్టర్ చేసుకున్నారు. వీటికి కారకులు ఇప్పుడు తీవ్ర పరిణామాలు ఎదుర్కోనున్నట్లు GHMC తెలిపింది.
FIR నమోదుకు రెడీ:
ఇప్పటి వరకు 300 PTINలు బ్లాక్ చేశారు. PTINలు పొందడానికి నోటరీల వంటి చెల్లని పత్రాలను సమర్పించే వ్యక్తులపై FIRలు నమోదు చేయాలని డిప్యూటీ కమిషనర్ లను GHMC కమిషనర్ ఆదేశించారు. 'ఆస్తి పన్ను స్వీయ అసెస్మెంట్' దరఖాస్తులో మోసపూరిత ఎంట్రీలను నమోదు చేసిన వ్యక్తులపైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇవీ మోసాలు:
కొందరు ఇప్పటికే సమర్పించిన నోటరీల ద్వారా PTINలను పొంది, ఆ ప్రాపర్టీని రిజిస్టర్ చేశారు. మరికొందరు తక్కువ ప్లింత్ ఏరియాను నమోదు చేసి కమర్షియల్ ఆస్తిని రెసిడెన్షియల్గా పేర్కొన్నారు. ఆస్తి పన్ను మొత్తాన్ని తగ్గించడానికి పలు రకాల మోసపూరిత విధానాలను అనుసరించారు. ఈ తరహా సమస్యల పరిష్కారానికి 'ప్రాపర్టీ టాక్స్ ఇంటెలిజెన్స్ సిస్టమ్'ను తీసుకొచ్చేందుకు GHMC నిర్ణయించిందని ఓ అధికారి వెల్లడించారు. దాని సరఫరా, అమలు, నిర్వహణ కోసం టెండర్లను ఆహ్వానించినట్లు చెప్పారు.
దిద్దుబాటు చర్యలు:
టెండర్ దక్కించుకున్న సంస్థ.. మొదటగా ప్రస్తుత విధానంలో లొసుగులను గుర్తించి కార్పొరేషన్ కు నివేదిక సమర్పించాల్సి ఉంటుందని ఆ అధికారి వెల్లడించారు. దాని ఆధారంగా 'ఆస్తి పన్ను స్వీయ అసెస్ మెంట్' అప్లికేషన్ తో సహా మొత్తం సిస్టంలో మార్పులు చేసి తప్పులు సరిదిద్దాలన్నారు. తద్వారా మోసాలకు అడ్డుకట్ట పడటంతో పాటు GHMC ఆదాయం పెరుగుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం అనంతరం ఈ విధానం అమల్లోకి వస్తుందని తెలిపారు.