1419 మంది ఉద్యోగులను తొలగించిన జనరల్ మోటార్స్ ఇండియా
జనరల్ మోటార్స్ ఇండియా సెక్షన్ 25 ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారం 1,419 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ మేరకు ఆంగ్లమీడియాలో వార్తలు వచ్చాయి. అమెరికా కార్ మేకర్ అయిన జనరల్ మోటార్స్ భారత విభాగమే జనరల్ మోటార్స్ ఇండియా. పుణే సమీపంలోని తాలేగావ్ ప్లాంట్లో ఈ ఉద్యోగాల కోత చోటు చేసుకుంది. తమను ఉద్యోగం నుండి తొలగించడంపై ఉద్యోగ సంఘాలు కోర్టులో సవాల్ చేయనున్నారని తెలుస్తోంది.
కొనుగోలుదారులకు మారుతీ సుజుకీ షాక్, రూ.22,500కు ధరల పెంపు
ఉద్యోగులకు తొలగింతపై లేఖ
తాలేగావ్ ప్లాంటులో పని చేస్తున్న వీరిని పారిశ్రామిక చట్టంలోని సెక్షన్ 25 ప్రకారం తొలగించింది. తొలగింతపై ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగుల తొలగింతకు సంబంధించి ఉద్యోగులందరికీ కంపెనీ ఓ మెయిల్ పంపించింది. అదే కాపీనీ జనరల్ మోటార్స్ ఉద్యోగుల యూనియన్ కార్యదర్శి, అధ్యక్షుడికి పంపించింది.
పరిహారం
పారిశ్రామిక వివాద చట్టం 1947లోని సెక్షన్ 25సి ప్రకారం వీరికి లే-ఆఫ్ పరిహారం లభిస్తుందని జనరల్ మోటార్స్ పేర్కొంది. వారి మూల వేతనంలో 50 శాతాన్ని పరిహారంగా చెల్లిస్తామని వెల్లడించింది. ఉద్యోగులను తొలగిస్తూ కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాము కోర్టులో సవాల్ చేస్తామని జనరల్ మోటార్స్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు సందీప్ స్పష్టం చేశారు. లే-ఆఫ్కు సంబంధించి ఫ్యాక్టరీ గేట్ వద్ద కూడా అంటించింది కంపెనీ.
నాలుగు నెలలుగా లేని ప్రొడక్షన్
సహజ విపత్తు కరోనా కారణంగా తొలగింపు చోటు చేసుకుందని, ఐడీ యాక్ట్ సెక్షన్ 25ఎం కింద ముందస్తు అనుమతి అవసరం లేదని ఫ్యాక్టరీ గేటు వద్ద ప్రదర్శించింది. కాగా, గత నాలుగు నెలలుగా ప్రొడక్షన్ లేకపోయినప్పటికీ జనరల్ మోటార్స్ ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తోంది.