గత ఏడేళ్లలో ఎప్పుడూ లేనంతగా అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో క్షీణించిన జీడీపీ వృద్ధి రేటు
న్యూఢిల్లీ: 2019 - 20లో త్రైమాసికాల పరిస్థితి చూస్తే దేశ ఆర్థిక వృద్ధి గత ఏడేళ్లలో ఎప్పుడూ లేనంతంగా అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో పతనమైంది. ఇందుకు కారణం ఉత్పత్తి రంగం, విద్యుత్ రంగాల్లో క్షీణత కనిపించడమే అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అసలే కరోనా వైరస్ దెబ్బకు మార్కెట్లు పతనం అవుతున్న నేపథ్యంలో దేశ ఆర్థిక వృద్ధిని స్థిరంగా ఉంచేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. డిసెంబర్ త్రైమాసికానికి ఆర్థిక వృద్ధి 4.7శాతంతో జీడీపీ పెరిగిందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ రిపోర్టును విడుదల చేసింది. ఇది 27 త్రైమాసికాల్లో అత్యంత తక్కువగా నమోదైన జీడీపీ వృద్ధి రేటని ఎన్ఎస్ఓ స్పష్టం చేసింది. 2012-13లో జనవరి-మార్చి త్రైమాసికానికి జీడీపీ వృద్ధి రేటు 4.3శాతంగా ఉన్నిందని జాతీయ గణాంకాల శాఖ వెల్లడించింది.
2018-19, 2019-20లలో నమోదైన త్రైమాసిక అంకెలను మాత్రమే ప్రభుత్వం విడుదల చేయడంతో ఇతర త్రైమాసికాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇస్తేనే పోల్చి చూడగలమని నిపుణులు చెబుతున్నారు. 2019-20లో రెండోసారి జీడీపీ వృద్ధిని 5శాతం అంచనా వేసింది ఎన్ఎస్ఓ. అయితే కరోనా వైరస్ ప్రభావం ఏమేరకు ప్రభావం చూపిందన్న విషయాన్ని వెల్లడించలేదు. కరోనా వైరస్ ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపుతోందని స్పష్టంగా అర్థమవుతోందని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే వ్యవసాయ రంగం మాత్రం డిసెంబర్ క్వార్టర్కు మంచి వృద్ధిని నమోదు చేసిందని ప్రభుత్వం చెబుతోంది. గతంలో 2శాతంగా ఉన్న వృద్ధి రేటు ఇప్పుడు 3.5శాతంకు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక ఉత్పత్తి రంగం 0.2శాతం క్షీణించినట్లు చెబుతోంది. ఈ ఏడాది తొలి క్వార్టర్లో 5.2శాతం వృద్ధిని ఉత్పత్తిరంగం నమోదు చేసిందని ప్రభుత్వం చెబుతోంది.
భారత ఆర్థిక వ్యవస్థను 60శాతం వరకు సేవారంగం ఆదుకుంటోంది. డిసెంబర్ క్వార్టర్కు సేవా రంగం 7.4శాతం వృద్దిని నమోదు చేసింది. గత త్రైమాసికంతో పోలిస్తే సేవారంగంలో స్వల్ప పెరుగుదల కనిపించిందని ప్రభుత్వం వెల్లడించింది. వ్యవసాయ రంగం సేవారంగాల్లో 2019-20 మూడవ త్రైమాసికంలో వృద్ధి నమోదు చేసుకుందని ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు 8 ప్రధాన రంగాల్లో ఒకటైన ఉత్పత్తి రంగంలో కూడా వృద్ధిరేటు పెరగడం హర్షించదగ్గ విషయమని ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి చక్రవర్తి చెప్పారు. కరోనావైరస్ ప్రభావం చూపిందా అన్న ప్రశ్నకు కచ్చితంగా ఉందని చెప్పారు.
చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై దిగుమతి రంగంపై కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉందని చక్రవర్తి చెప్పారు. ఇదిలా ఉంటే ఆర్థిక వ్యవస్థ పై కరోనా వైరస్ ప్రభావం ఏమేరకు ఉంది ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం సమీక్ష జరుపుతోందన్నారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. కంగారు పడాల్సిన అవసరం లేదని ఆమె భరోసా ఇచ్చారు. ఖర్చుల, వినియోగంలో రెండకెల సంఖ్యను చేరుకోవడం వంటి అంశాలతో మూడవ త్రైమాసికంలో వృద్ధిరేటు పెరిగిందని కేర్ రేటింగ్స్ చీఫ్ ఎకానమిస్ట్ మదన్ సాబ్నవిస్ చెప్పారు.
ఇక ఆర్థిక వృద్ధి నమోదు కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా పలు కీలక రేట్లలో కోత విధించింది. అంతేకాదు వడ్డీ రేట్లలో మరింత కోత విధించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పర్యాటక రంగం, వాణిజ్యరంగం, ఉత్పత్తి రంగాల్లో కరోనా వైరస్ ఎఫెక్ట్ ఏమేరకు ఉందనేది చెప్పడం కష్టమని ఐసీఆర్ఏ ప్రిన్సిపల్ ఎకానమిస్ట్ ఆదితి నాయర్ చెప్పారు. ఇక 2020 ఆర్థిక సంవత్సరం త్రైమాసిక ఫలితాలు చూస్తే మరోసారి మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో కీలక రేట్లలో కోత విధించే అవకాశాలు కనిపిస్తున్నాయని నాయర్ చెప్పారు.