EPF నుంచి TDS వరకు: 2021 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే..!
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ 2021ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె ఆదాయపు పన్నుకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు చేశారు. వేతన జీవులకు అండగా నిలిచేలా ఈ ప్రతిపాదనలు ఉన్నాయి. ఇక ఆదాయపు పన్ను అంశాలపై తీసుకొచ్చిన సంస్కరణలు ఈ ఏడాది 1 ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త ప్రతిపాదనల ప్రకారం ఏప్రిల్ 1 నుంచి 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజెన్లకు తమ పెన్షన్పై, లేదా ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీపై పన్ను మినహాయింపు ఉంటుంది. అంతేకాదు ఐటీ రిటర్న్స్ దాఖలు మరింత సులభతరం చేసేందుకు ప్రీ ఫిల్డ్ ఐటీఆర్ ఫారంలను ప్రవేశపెట్టనున్నారు. ఐటీఆర్ దాఖలు చేయని వారిపై ఎక్కువ రేటుతో కూడిన టీడీఎస్ డిడక్షన్స్, ఎల్టీసీ స్కీములు ఇతరత్రా అంశాలు అమల్లోకి రానున్నాయి. ఇక ఏప్రిల్ 1 నుంచి ఈపీఎఫ్ పై వచ్చే వడ్డీ ఏడాదికి రూ.2.5 లక్షలు ఉంటే దానికి పన్ను పడుతుందని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు ఏంటో ఒకసారి చూద్దాం...
రూ.2.5 లక్షలు ఈపీఎఫ్కు జమ చేస్తున్నట్లయితే..
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)కు యాజమాన్యాలు ఏడాదికి రూ.2.5 లక్షలకు మించి డిపాజిట్ చేస్తే అలాంటి డిపాజిట్లపై పన్ను విధించబడుతుంది. అధిక సంపాదన కలిగి ఉండి ఈపీఎఫ్కు అధిక మొత్తాన్ని కంట్రిబ్యూట్ చేస్తున్న వారిపై పన్ను భారం వేసే ఉద్దేశంతోనే ఈ మార్పు తీసుకొచ్చినట్లు కేంద్రం తెలిపింది. ఈపీఎఫ్ అనేది ఉద్యోగుల ప్రయోజనాలకోసమే ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పిన నిర్మలా సీతారామన్... ఏడాదికి రూ.2 లక్షలు ఈపీఎఫ్కు కంట్రిబ్యూట్ చేయని ఉద్యోగస్తులపై ఈ ప్రభావం ఉండదని, టాక్స్ భారం అంతకన్నా ఉండదని స్పష్టం చేశారు.
ప్రీ ఫిల్డ్ ఐటీ రిటర్న్స్
ఇక ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడంలో చాలామంది కష్టపడుతున్నారు. అదే సమయంలో ఇబ్బంది కూడా పడుతున్నారు. ఆ ఫారంలో ఉన్న కొన్ని అంశాలు అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఈ తలనొప్పులు లేకుండా కేంద్రం ఐటీఆర్ ఫారంను టాక్స్ పేయర్స్ కోసం మరింత సులభతరం చేసింది. దీన్నే ప్రీ ఫిల్డ్ ఇన్కమ్టాక్స్ రిటర్న్స్ అని పిలుస్తున్నాము. అంటే కొన్ని అంశాలు ఐటీ రిటర్న్స్ ఫారంలో ముందుగానే నింపి ఉంటాయి. సో దీని వల్ల టాక్స్ పేయర్ ఎలాంటి ఇబ్బందులు పడరు. ఐటీ రిటర్న్స్ సులభతరంగా దాఖలు చేసే అవకాశాలుంటాయి.
ఎల్టీసీ వోచర్ స్కీమ్
ఎల్టీసీ (లీవ్ ట్రావెల్ కన్సెషన్) క్యాష్ ఓచర్ పథకాన్ని కేంద్రం 2021 బడ్జెట్లో ప్రకటించింది. మార్కెట్ డిమాండ్ను పెంచేందుకు ఈ పథకాన్ని మోడీ ప్రభుత్వం గతేడాది తీసుకొచ్చింది. ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఎవరైతే కోవిడ్ కారణంగా ప్రయాణాలకు అడ్డంకి కలిగి ఎల్టీసీని వినియోగించుకోలేకపోయారో అలాంటి వారికి పన్ను మినహాయింపు ఇవ్వాలని భావించింది కేంద్రం.
అధిక టీడీఎస్
ఎవరైతే ఐటీ రిటర్న్స్ను గడువులోగా దాఖలు చేయడం లేదో అలాంటి వారిపై టీడీఎస్ రేటు కాస్త అధికంగా విధించాలనే ప్రతిపాదన కేంద్రం తీసుకొచ్చింది. ఇది కూడా ఇన్కం టాక్స్ చట్టంలోని 206 ABకి లోబడే ఉంటుంది.
75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజెన్లకు గుడ్ న్యూస్
75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజెన్లకు వచ్చే పెన్షన్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీలపై పన్ను మినహాయింపును ఇవ్వాలని కేంద్రం భావించింది. ఇలాంటి వారు ఐటీ రిటర్న్స్ 1 ఏప్రిల్ 2021 నుంచి దాఖలు చేయాల్సిన అవసరం లేకుండా కేంద్రం ప్రతిపాదనలు తీసుకొచ్చింది. అయితే ఈ బెనిఫిట్ పొందాలంటే సీనియర్ సిటిజెన్లు తీసుకుంటున్న పెన్షన్తో పాటు తమ ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా ఒకే బ్యాంకులో ఉండాలనే నిబంధన కేంద్ర ప్రభుత్వం పెట్టింది.