రికార్డ్స్థాయికి ఫారెక్స్ నిల్వలు: ఈ కారణాలవల్ల పైపైకి...
కరోనా మహమ్మారి నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోను భారత ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. జూన్ 12వ తేదీన భారత సెంట్రల్ బ్యాంకు రిలీజ్ చేసిన గణాంకాల ప్రకారం ఫారన్ ఎక్స్చేంజ్ నిల్వలు రూ.37.92 లక్షల కోట్ల రికార్డుకు చేరుకున్నాయి. ఈ సంక్షోభ పరిస్థితుల్లో పారెక్స్ నిల్వలు భారీగా పెరగడం ఆర్థిక పరిస్థితిలోని స్థిరత్వానికి కొంత నిదర్శనంగా చెబుతున్నారు.
కీలక అడుగు: అమెరికాలో భారత్ చమురు నిల్వలు.. ఎందుకంటే
ఫారెక్స్ రికార్డ్స్
జూలై 10వ తేదీతో ముగిసిన వారానికే ఫారెక్స్ రిజర్వ్స్ 310.80 కోట్ల డాలర్లు పెరిగి 51,636.20 కోట్ల డాలర్లకు చేరాయని ఆర్బీఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంతకుముందు జూలై 3వ తేదీతో ముగిసిన వారంలో ఈ నిల్వలు 641.60 కోట్ల డాలర్లు పెరిగి 51,354 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. జూన్ 5వ తేదీన మారకపు నిల్వలు మొదటిసారి 50,000 కోట్ల డాలర్ల రికార్డును అధిగమించాయి.
ఐఎంఎఫ్ వద్ద నిల్వల స్థితి
జూలై 10వ తేదీతో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వల్లో కీలకమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 237.20 కోట్ల డాలర్లు పెరిగి 47,563.50 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. బంగారం నిల్వలు కూడా 71.2 కోట్ల డాలర్లు పెరిగి 3,472.90 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి వద్ద స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ 50 లక్షల డాలర్లు పెరిగి 145.30 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. ఐఎంఎఫ్ వద్ద నిల్వల స్థితి కూడా 1.9కోట్ల డాలర్లు పెరిగి 454.50 కోట్ల డాలర్లుగా నమోదయింది.
చమురు ద్వారానే 59 బిలియన్ డాలర్లు ఆదా
విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల వ్యాల్యూ కూడా అంతకంతకు పెరగడం వల్ల రిజర్వ్స్ ఎగబాకుతున్నట్లు ఆర్బీఐ తెలిపింది. అదే సమయంలో దిగుమతి బిల్లులు తగ్గడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరగడం, విదేశీ పోర్ట్ పోలియో పెట్టుబడిదారుల నుండి స్టాక్, డెట్ మార్కెట్లలోకి మెరుగైన ప్రవాహం, ఆర్బీఐ కొనుగోలు వంటి అంశాలు ఫారెక్స్ నిల్వలు పెరగడానికి దోహదపడుతున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధరలు ఏప్రిల్లో భారీగా తగ్గాయి. క్రూడాయిల్ కోసం మనం చేసే ఖర్చు తగ్గింది. ఈ ఏడాదిలో భారత్ ఆయిల్ దిగుమతుల ద్వారా 59 బిలియన్ డాలర్ల మేర ఆదా చేసిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.