ఆరోగ్య రంగానికి పెద్దపీట, ప్రతి గ్రామానికి బ్రాడ్ బాండ్ కోసం...
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. దీంతో కేంద్ర ప్రభుత్వం మరోసారి భారీ ప్యాకేజీతో ముందుకు వచ్చింది. కేంద్ర ఆర్థిక సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్తో కలిసి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్యాకేజీ ప్రకటన చేశారు. వైద్య, ఆరోగ్య వసతులను మెరుగుపరచడంపై దృష్టి సారించినట్లు తెలిపారు.
డీఏపీ, ఎన్పీకే ఫెర్టిలైజర్స్కు అదనపు మద్దతు ఇస్తామని నిర్మలమ్మ ప్రకటించారు. రూ.14,775 కోట్ల సబ్సిడీని ఇస్తామన్నారు. ఇందులో రూ.9,125 కోట్లు డీఏపీకి, రూ.5,650 కోట్లు ఎన్పీకేకు అన్నారు. మొత్తంగా ఆర్థిక భారం అంచనాలు రూ.93,869 కోట్లుగా ఉందని, మొత్తం కాస్ట్ రూ.2,27,841 కోట్లుగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద మే నెల నుండి నవంబర్ నెల వరకు 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా చిన్న పిల్లల సంరక్షణ, ప్రజల ఆరోగ్యం కోసం రూ.23,220 కోట్లు కేటాయించామన్నారు.
వైద్య సౌకర్యాల కల్పనకు రూ.50వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. పిల్లలు, వారి సంరక్షణ, బెడ్స్కు ప్రాధాన్యతనిస్తూ ప్రజల ఆరోగ్యం కోసం అదనంగా రూ.23,000 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఇతర రంగాలకు రూ.60వేల కోట్లు కేటాయిస్తున్నామన్నారు. వైద్య, ఆరోగ్య శాఖకు సాయం చేసే సంస్థలకు అండగా ఉంటామన్నారు.
రైతన్నల ఆదాయం రెండింతలు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నేషనల్ ఎక్స్పోర్ట్ ఇన్సురెన్స్ అకౌంట్(NEIA) ద్వారా ప్రాజెక్ట్ ఎక్స్పోర్ట్కు రూ.33,000 కోట్లను కేటాయిస్తున్నామన్నారు. రానున్న అయిదేళ్ల కాలంలో ఎగుమతులును ప్రోత్సహించేందుకు ఈసీజీసీలో రూ.88,000 కోట్లు కేటాయిస్తామన్నారు. డిజిటల్ ఇండియాలో భాగంగాప్రతి గ్రామానికి బ్రాడ్ బాండ్ వెళ్లేలా భారత్ నెట్ పీపీపీ మోడల్ ద్వారా అదనంగా రూ.19,041 కోట్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు.