నిర్మలమ్మ భారీ ప్యాకేజీ, దెబ్బతిన్న రంగాలకు రూ.1.1 లక్షల కోట్ల లోన్ గ్యారెంటీ స్కీం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వల్ల దెబ్బతిన్న రంగాలకు రూ.1.1 లక్షల కోట్ల లోన్ గ్యారెంటీ స్కీంను ప్రకటించారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. కరోనా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. వివిధ రంగాలు కోలుకోలేని విధంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో మొత్తం రూ.30 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఇటీవల సెకండ్ వేవ్ దెబ్బతీసింది. దీంతో నిర్మలమ్మ మరోసారి ప్యాకేజీతో ముందుకు వచ్చారు.
అలాగే, ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీం (ECLGS) కింద మరో రూ.1.5 లక్షల కోట్లు ప్రకటించారు. దీనిని రూ.3 లక్షల నుండి రూ.5 లక్షలకు పొడిగించాలనే విజ్ఞప్తులు వచ్చాయి. వారి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందిస్తూ రూ.4.5 లక్షల కోట్లను అదనంగా ప్రకటించారు. వైద్య, మౌలిక సదుపాయాల పైన ప్రత్యేక దృష్టి సారించాలని నిర్మలా సీతారామన్ ప్యాకేజీ ప్రకటన సందర్భంగా అన్నారు.
ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో వైద్య మౌలిక సదుపాయాల వృద్ధిపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. వైద్య, ఔషధ రంగాల్లో కొత్త ప్రాజెక్టులకు రుణ హామీ ఇచ్చారు. మైక్రోఫైనాన్స్ సంస్థల ద్వారా రూ.1.25 లక్షల కోట్ల రుణాలు అందించనున్నట్లు తెలిపారు. రుణ మాఫీ పథకం కింద తీసుకున్న రుణాలకు వడ్డీ రేటు 7.95 శాతమని తెలిపారు.