మీ కంటే మేమే: 2008 ఆర్థిక సంక్షోభం, 2020 కరోనా పరిస్థితులను పోల్చిన నిర్మలమ్మ
బడ్జెట్ పైన లోకసభలో చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వివిధ అంశాలపై స్పందించారు. క్రిప్టో కరెన్సీ అంశంతో పాటు కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా వర్క్ చేసిందని చెబుతూ, 2008 నాటి ఆర్థిక సంక్షోభ పరిస్థితులతో పోల్చి చెప్పారు. నిర్మలమ్మ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఫిబ్రవరి 1న బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బడ్జెట్ పైన చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు.
మేం చాలా బెట్టర్!
2020-21లో కరోనా కారణంగా జీడీపీలో రూ.9.57 లక్షల కోట్ల క్షీణత నమోదయిందని నిర్మలమ్మ తెలిపారు. '2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో భారత జీడీపీ రూ.2.12 లక్షల కోట్లకు చేరుకుంది. కరోనా సంక్షోభంలో జీడీపీ రూ.9.57 లక్షల కోట్లు తగ్గింది. సరఫరా గొలుసుకు అంతరాయం ఏర్పడినప్పటికీ 2020-21లో ద్రవ్యోల్భణం 6.2 శాతంగా ఉంది. అయితే 2008-09లో ఇది 9.1 శాతంగా ఉంది. అంటే కరోనా వంటి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోను ద్రవ్యోల్భణాన్ని 2008-09 నాటి కంటే మంచి పరిస్థితుల్లో ఉంచగలిగాం' అన్నారు.
క్రిప్టోపై కలిసి పని చేస్తున్నాం...
క్రిప్టో కరెన్సీ పైన భారత ప్రభుత్వం-రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కలిసి పని చేస్తోందని నిర్మలమ్మ అన్నారు. కేవలం క్రిప్టో పైన మాత్రమే కాదని, ఇతర ప్రతి విషయంలోను తాము కలిసి పని చేస్తున్నామని తెలిపారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రాధాన్యతల ఆధారంగా కలిసి పని చేస్తున్నామన్నారు. ఇరువురి మధ్య ఎలాంటి సమస్య లేదన్నారు. ప్రయివేటు క్రిప్టోతో పాటు అధికారిక డిజిటల్ కరెన్సీ పైన ఆర్బీఐతో చర్చిస్తున్నామన్నారు. పలు దఫాలు చర్చించి, అన్ని అంశాలపై ఒక అభిప్రాయానికి వచ్చాక నిర్ణయం ప్రకటిస్తామన్నారు.
ఆ మోసం యూపీఏ హయాంలో
గుజరాత్కు చెందిన ఏజీబీ షిప్ యార్డ్ 28 బ్యాంకులను రూ.22,842 కోట్లకు మోసగించిన వ్యవహారంపై నిర్మలమ్మ స్పందించారు. ఆమె ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం అనంతరం మాట్లాడారు. తక్కువ సమయంలో బ్యాంకులు ఈ మోసంపై నిర్ణయానికి వచ్చాయని, ఆ సంస్థకు రుణాలు తమ ప్రభుత్వం హయాంలో ఇవ్వలేదని, 2013 నవంబర్ నెలలో యూపీఏ హయాంలోనే ఈ ఖాతా ఎన్పీఏగా మారిందన్నారు. 2014 మార్చిలో రుణాలను పునర్వ్యవవస్థీకరించినా ప్రయోజనం లేదన్నారు.