లోక్సభలో నిర్మలమ్మ ఏం చెప్పబోతోన్నారు?: విశాఖ ఉక్కుపై ఏం చేయబోతోన్నారు?
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. ఇంకాస్సేపట్లో లోక్సభలో ప్రసంగించబోతోన్నారు. 2021-2022 ఆర్థిక సంవత్సరానికి పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలపై ఇప్పటిదాకా చోటు చేసుకున్న చర్చలు, సభ్యులు సంధించిన ప్రశ్నలు, లేవనెత్తిన అనుమానాలను తెర దించే ప్రయత్నం చేయనున్నారు. వాటన్నింటికీ ఆమె సమాధానం ఇవ్వబోతోన్నారు. ఈ ఉదయం 10 గంటలకు లోక్సభలో ఆమె మాట్లాడతారు. బడ్జెట్ ప్రతిపాదనల్లో ఏవైనా సవరణలు తీసుకున్నారా? లేదా భవిష్యత్లో అలాంటి ప్రయత్నాలు చేస్తారా? దిద్దుబాటు చర్యలేమైనా ప్రకటిస్తారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
టాటా మోటార్స్ స్టీరింగ్.. ఇక మరొకరి చేతుల్లో: కొత్త సారథి ఎవరంటే..?
ఉదయమే లోక్సభ..
లోక్సభ ఉదయమే సమావేశం కాబోతోంది. నిజానికి- షెడ్యూల్ ప్రకారం.. ఉదయం రాజ్యసభ, మధ్యాహ్నం లోక్సభ సమావేశం కావాల్సి ఉంది. రాజ్యసభ వాయిదా పడింది. ఫలితంగా- మధ్యాహ్నం ఏర్పాటు కావాల్సిన లోక్సభను ముందుకు తీసుకొచ్చారు. ఉదయమే సమావేశపరిచారు. దీనిపై స్పీకర్ ఓం బిర్లా శుక్రవారమే ఓ ప్రకటన చేశారు. బడ్జెట్ ప్రతిపాదనలపై చోటు చేసుకున్న చర్చలపై రాజ్యసభలో శుక్రవారమే ఆమె సమాధానం ఇచ్చారు. ఇక ఈ సారి లోక్సభ వంతు వచ్చింది.
బడ్జెట్ డౌట్స్పై
నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలపై దేశవ్యాప్తంగా ప్రశంసలు, విమర్శలు అందిన విషయం తెలిసిిందే. బడ్జెట్ ప్రతిపాదనలను సభలో ప్రవేశపెట్టిన కొన్ని గంటలకే స్టాక్ మార్కెట్ పరుగులు పెట్టడాన్ని శుభసూచకంగా భావించారు మార్కెట్ విశ్లేషకులు. అదే సమయంలో విమర్శలు భారీగా వినిపించాయి. సామాన్యుడికి మేలు బడ్జెట్ కాదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న తమిళనాడు, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్కు వేల కోట్ల రూపాయల మేర బడ్జెట్ను కేటాయించడం, కర్ణాటక వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలకు అదే స్థాయిలో కేటాయింపులు ఉండటం వంటి పరిణామాల పట్ల అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.
పెట్టుబడుల ఉపసంహరణపై..
అదే సమయంలో- విశాఖపట్నం ఉక్కు కర్మాగారం సహా పలు ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించుకుంటామని నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన రాజకీయ దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. ప్రత్యేకించి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వ్యవహారం ఏపీలో సంచలనం రేపుతోంది. విశాఖలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (RINL)లో పెట్టుబడులను ఉపసంహరించుకోవాలనే నిర్ణయాన్ని పునరాలోచించాలంటూ రాజకీయ పార్టీలన్నీ డిమాండ్ చేస్తోన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు నిర్మలా సీతారామన్ను కలిసి వినతిపత్రాన్ని కూడా అందించారు. ఈ పరిణామాల మధ్య ఆమె లోక్సభలో బడ్జెట్ ప్రతిపాదనలపై సమాధానం ఇవ్వబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉత్కంఠతను రేపుతోంది.