ఫిబ్రవరి 1న 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మల
ముంబై: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం గం.11 సమయానికి బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ మేరకు గురువారం లోకసభ సెక్రటరియేట్ ధృవీకరించింది. 17వ లోకసభ సమావేశాలు జనవరి 29వ తేదీన ప్రారంభమవుతాయని, ఏప్రిల్ 8న ముగుస్తాయని వెల్లడించింది. 29న ఉదయం పదకొండు గంటలకు పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు.
కరోనా కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఈ సవాల్ను అధిగమించి దేశ ఆర్థిక రంగానికి పునరుత్తేజాన్నిచ్చి ఇచ్చేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సారథ్యంలోని జట్టు బడ్జెట్ని రూపొందించింది. అత్యంత సవాళ్లతో కూడిన బడ్జెట్ను సమర్పించేందుకు నిర్మల సిద్ధమయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సంప్రదాయాలు, పద్దతులతో నిమిత్తం లేకుండా పేపర్ లెస్ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు.
1947 నవంబర్ 26 తర్వాత డాక్యుమెంట్స్ ముద్రించకుండా ఆర్థికమంత్రి తొలిసారి బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంటుకు సమర్పిస్తారు. బడ్జెట్ ప్రతులను ముద్రించడానికి నార్త్బ్లాక్లో ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేశారు. చాలామంది బడ్జెట్ అధికారులు ఈ భవనంలోనే బస చేసి, బడ్జెట్ తయారీ, పత్రాల ముద్రణలో పాల్గొంటారు. బడ్జెట్ను పార్లమెంట్లో సమర్పించే వరకు ఆర్థికశాఖ అధికారులు నార్త్బ్లాక్లోనే ఉంటారు. అయితే ఈసారి కరోనా వల్ల డాక్యుమెంట్స్ లేవు.