జీ20 ఆర్థికమంత్రుల భేటీలో నిర్మలమ్మ: ఆర్థిక రంగాన్ని గట్టెక్కించే చర్యలపై
న్యూఢిల్లీ: జీ20 దేశాల ఆర్థికమంత్రుల సమావేశంలో కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ పాల్గొన్నారు. వర్చువల్ విధానంలో ఈ భేటీ కొనసాగింది. దేశ రాజధానిలోని తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జీ20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ప్రాణాంతక కరోనా వైరస్ మిగిల్చిన సంక్షోభం పరిస్థితుల నేపథ్యంలో- ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దడం, ఈ సెక్టార్ను గాడిన పెట్టడం వంటి అంశాలపై ఈ భేటీలో చర్చిస్తారు.
తమ దేశాల్లో నెలకొన్న తాజా స్థితిగతులు, ఇతరత్రా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటారు. అంతర్జాతీయ స్థాయి పన్నుల అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు రానుంది. జర్మనీ ఆర్థికశాఖ మంత్రి ఒలాఫ్ స్కాల్జ్ అంతర్జాతీయ పన్నుల అంశాన్ని ప్రస్తావించారు. కరోనా వైరస్ను ఎదుర్కొనడంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి నిర్మల సీతారామన్ వివరించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జోరుగా సాగిస్తోన్నామని చెప్పారు. ప్రతి వ్యక్తికీ వ్యాక్సిన్ వేయడంలో కోవిన్ పోర్టల్, యాప్ సేవల పాత్రల గురించి ప్రస్తావించారు.
వ్యాక్సిన్ను దేశ ప్రజలకు ఉచితంగా అందజేస్తోన్నామని, ఈ బృహత్తర కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వమే చేపట్టిందని నిర్మలమ్మ జీ20 దేశాల ఆర్థిక మంత్రులకు వివరించారు. ఆర్థిక రంగాన్ని గట్టెక్కించడానికి డిజిటలైజేషన్, క్లైమెట్ యాక్షన్, మౌలిక రంగాన్ని సుస్థిరపర్చడం వంటి చర్యలను చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు. అంతర్జాతీయ పన్నుల విధానాన్ని అమలు చేయడం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని నిర్మల సీతారామన్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
భౌగోళిక పరిస్థితులు, దిగుమతులు, ఎగుమతుల విధానాలపై అంతర్జాతీయ పన్నుల విధానం ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఆర్థిక రంగాన్ని గట్టెక్కించే చర్యల్లో భాగంగా కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరం ఏర్పడొచ్చని ఆమె ప్రస్తావించినట్లు సమాచారం. కరోనా వైరస్ తీవ్రత ప్రపంచ దేశాలన్నింటినీ ఇబ్బందులకు గురి చేసిందని, దీని నుంచి బయటపడటానికి కొంత సమయం పట్టొచ్చనీ, వేగంగా పురోగమించాల్సిన బాధ్యత ప్రపంచ దేశాలపై ఉందని అన్నారు.