డబ్బులిచ్చి ఇళ్లు పొందలేని వారికి శుభవార్త: 'రియల్'పై మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థికరంగం ఊతానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇటీవల పలు ఉద్దీపన ప్రకటనలు చేస్తోంది. దారుణంగా పడిపోయిన ఆటో రంగం కోసం, ఎఫ్ఎంసీజీ కోసం కూడా ఉద్దీపనలు ప్రకటించింది. కార్పోరేట్ ట్యాక్స్ తగ్గించింది. తాజాగా, రియాల్టీ రంగానికి ఊతమిచ్చేలా రూ.25వేల కోట్లతో ఉద్దీపన పథకం ప్రకటించింది. బ్యాంకింగ్ రంగం నుంచి నిర్మాణ రంగం వరకు ప్రోత్సాహం ఇచ్చేందుకు ఆర్బీఐకి తగిన సూచనలు చేసినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కేబినెట్ సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. నిర్మాణ రంగానికి ఆర్థిక సాయం కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎస్బీఐ, ఎల్ఐసీ లాంటి సంస్థల ద్వారా సులభంగా రుణాలు ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
BSNLలో 80,000 మందికి వీఆర్ఎస్! దరఖాస్తు తేదీ, అర్హులు
వారు బాధలు పడవద్దనే ఈ స్కీం
దేశవ్యాప్తంగా నిధుల కొరతతో మధ్యలో నిలిచిపోయిన గృహ నిర్మాణ ప్రాజెక్టుల పూర్తికి చేయూత అందించేందుకు రూ.25,000 కోట్లతో ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి (AIF) ఏర్పాటుక కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇళ్ల కొనుగోలు కోసం అడ్వాన్స్లు ఇచ్చి, అంతిమంగా ప్లాట్లు చేతికి రాక ఇబ్బందిపడుతున్న బాధితుల ఇబ్బందుల దృష్ట్యా ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
ఆగిపోయిన ప్రాజెక్టుల కోసం ఫండ్స్
దేశవ్యాప్తంగా 1600 హౌసింగ్ ప్రాజెక్టులు, 4.58 లక్షల హౌసింగ్ యూనిట్స్ నిర్మాణాలు మధ్యలో ఆగిపోయినట్లు నిర్మల తెలిపారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న విషయమై బాధితులు, బిల్డర్లు, బ్యాంకర్లు, ఆర్బీఐ అధికారులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించామని, ఆర్బీఐ గవర్నర్ హాజరైన సమావేశంలో అసంపూర్తి ప్రాజెక్టులకు అవసరమైన ఫండ్స్ అందించేందుకు ఫండ్ నిధి ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు.
ప్రభుత్వం నుంచి రూ.10,000 కోట్లు
ఈ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం రూ.10,000 కోట్లు సమకూరుస్తుంది. ఎస్బీఐ, ఎల్ఐసీ వంటి సంస్థలు రూ.15,000 కోట్ల నిధిని సమకూరుస్తాయి. ఇందులో భాగస్వాములు అయ్యేందుకు సావరీన్ ఫండ్, ఫెన్షన్ ఫండ్ కూడా ఆసక్తి చూపుతోంది. కాబట్టి ఈ నిధి మరింత పెరిగే అవకాశముందని నిర్మల చెప్పారు.
నాటి ప్లాన్.. మరింత విస్తరణ
గత సెప్టెంబర్ 14వ తేదీన నాటి ప్లాన్ ఆధునిక రూపమే ఈ AIF అని నిర్మల చెప్పారు. పూర్తికానీ ప్రాజెక్టులకు రుణాలు అందేలా ఓ స్పెషల్ విండోను మాత్రమే ఆ రోజు ప్రకటించారు. ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేయడమే లక్ష్యంగా ఇప్పుడు AIFను కేంద్రం విస్తరించింది ముందుకు తీసుకు వచ్చింది. 2022 నాటికి అందరికీ ఇళ్లు అన్న లక్ష్యానికీ ఇలా కూడా దగ్గర కావొచ్చని మోడీ ప్రభుత్వం భావిస్తోంది.
వారికి భారం తగ్గుతుంది...
హోమ్ లోన్ కోసం బ్యాంకు రుణాలు తీసుకున్న వారికీ తమ ఈ నిర్ణయం ఊరట కలిగిస్తుందని, ఇళ్లు పూర్తిగాక, EMIల భారం మోస్తున్న వారు చాలామంది ఉన్నారని, వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. అలాంటివారిని దృష్టిలో పెట్టుకుని తాజా నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు.
ఎవరికెంత నిధులు...
నిలిచిపోయిన ప్రాజెక్టుల విలువ ముంబై వంటి నగరాల్లో కనీసం రూ.2 కోట్లు, ఇతర రాష్ట్రాల రాజధానులు, ముఖ్య నగరాల్లో రూ.1.5 కోట్లు, మిగతా ప్రాంతాల్లో రూ.1 కోటి ఉన్న వాటికి నిధులు సమకూర్చనున్నారు. ఎన్పీఏలుగా గుర్తించిన కంపెనీలు, ఎన్సీఎల్టీకి వెళ్లినా లిక్విడేషన్ ఉత్తర్వులు రాని సంస్థలకు కూడా చేయూత ఉంటుంది.
నిధులు ఇలా.. ప్రాజెక్టులకు మాత్రమే...
ఇక, ప్రాజెక్టు పనులు జరిగే వేగాన్ని బట్టి నిధులు అందిస్తారు. అసలే పూర్తి కాని ప్రాజెక్టులకు నిధులు ఉండవు. చివరి దశలో లేదా అతి త్వరగా పూర్తయ్యే ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యం ఉంటుంది. ఇక్కడ మరో విషయం ఉంది. పాతబకాయిలు తీర్చుకోవడానికి, ఇతర అవసరాల కోసం ఈ నిధులు ఉపయోగించవద్దు. వంద శాతం ప్రాజెక్టుల పూర్తికే ఉపయోగించాలి. రెరా చట్టం కింద నమోదై ఉండి, అప్పుల కన్నా ఆస్తుల విలువ ఎక్కువగా ఉన్న ప్రాజెక్టులకు నిధుల సమకూరుస్తారు.
త్వరగా పూర్తయ్యే ప్రాజెక్టులకు నిధులు ఇస్తే ప్రయోజనం
అసలే ప్రారంభించని ప్రాజెక్టుల కంటే త్వరగా పూర్తయ్యే ప్రాజెక్టులకు నిధులు ఇస్తే హోమ్ బయ్యర్స్ చేతికి ఇళ్లు వెళ్తాయని, వారు ఈఎంఐల రూపంలో చెల్లించే డబ్బు వెనక్కి వస్తుందని, అప్పుడు ద్రవ్య లభ్యత పెరుగుతుందని నిర్మల చెప్పారు. అసంపూర్తిగా నిలిచిన ఇళ్ల కొనుగోలుదారులకు ఇది ప్రయోజనమని చెప్పారు.