ఫ్లిప్కార్ట్ ఫౌండర్ల ఇన్వెస్ట్మెంట్ కంపెనీ మూసివేత... ఆ నిర్ణయం వెనుక అసలు కారణం అదే!
ఇండియన్ అమెజాన్ గా గుర్తింపు తెచ్చుకున్న కంపెనీ ఫ్లిప్కార్ట్. దేశీయంగా ఎదిగి ఇండియన్ ఈ కామర్స్ రంగంలోనే కాకుండా మొత్తం స్టార్టుప్ కంపెనీలకే ఒక మార్గదర్శిగా నిలిచింది. ఈ కంపెనీని స్థాపించిన సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ కూడా ఇండియన్ స్టార్టుప్ హీరో లుగా నిలిచారు. బెంగళూరు లో ఒక అపార్ట్మెంట్ లో మొదలైన ఫ్లిప్కార్ట్ ప్రస్థానం... ఆ కంపెనీ విలువను రూ 1.5 లక్షల కోట్ల స్థాయికి తీసుకెళ్లడంలో వారి కృషి ఎనలేనిది. ప్రారంభించిన 10 ఏళ్లలోనే యూనికార్న్ (1 బిలియన్ డాలర్ వాల్యుయేషన్) గా ఎదిగి స్టార్టుప్ కంపెనీలకు ఉన్న సత్తాను చాటిన మొట్టమొదటి ఇండియన్ కంపెనీ ఫ్లిప్కార్ట్.
అయితే రెండేళ్ల క్రితం ఫ్లిప్కార్ట్ ను అమెరికా రిటైల్ దిగ్గజం కొనుగోలు చేసిన అనంతరం భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఇద్దరు ఫౌండర్లు సచిన్, బిన్నీ బన్సల్ లకు చెరో 1 బిలియన్ డాలర్ల (సుమారు రూ 7,500 కోట్లు) మొత్తం వాటాల రూపంలో దక్కింది. దీంతో సచిన్ బన్సల్ పూర్తిగా ఫ్లిప్కార్ట్ నుంచి వైదొలిగారు. అదే క్రమంలో ఫ్లిప్కార్ట్ లో కొంత వాటాను కొసగిస్తూనే బిన్నీ కూడా కంపెనీ కి రాజీనామా చేసి బయటకు వచ్చేసారు. ఐతే, వీరిద్దరు మంచి మిత్రులు కాబట్టి... బయటకు రాగానే ఒక సంయుక్త ఇన్వెస్ట్మెంట్ కంపెనీ స్థాపించారు.
లోన్ మారటోరియంపై పొడిగిస్తారా? నిర్మల ఏం చెప్పారంటే?
సబీన్ అడ్వైసర్స్ మూసివేత...
ఇద్దరు మిత్రులుగా కలిసి తమ పేర్లలో తొలి అక్షరాలను కలిపి సబీన్ అడ్వైసర్స్ పేరుతో స్టార్టుప్ కంపెనీల్లో పెట్టుబడుల కోసం ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఏర్పాటు చేశారు. సచిన్ నుంచి 'స' ను బిన్నీ నుంచి 'బీన్' లను కలిపి సబీన్ గా దీనికి నామకరణం చేశారు. 2018 లోనే ఈ సంస్థను దీనిని రిజిస్టర్ చేసినప్పటికీ... ఆశించిన స్థాయిలో కార్యకలాపాలు కొనసాగలేదు.
పైగా అదే సమయంలో ఇద్దరు ఫౌండర్లు వేరు వేరు గా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ పోయారు. దీంతో ఈ సంయుక్త కంపెనీ పై దృష్టి సారించలేకపోయారు. గత ఏడాదిన్నర కాలంగా ఇద్దరి ఇన్వెస్ట్మెంట్ అభిరుచులు, ప్రాధాన్యతలు మారిన నేపథ్యంలో ఇక సంయుక్త ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఆవశ్యకత లేదని గుర్తించారు. దీంతో సబీన్ అడ్వైసర్స్ ను మూసివేయాలని నిర్ణయించారు. ఈ మేరకు భారత కంపెనీల చట్టం ప్రకారం దానిని వైండ్ అప్ చేసే ప్రక్రియను ప్రారంభించారు. ఈ మేరకు ఎంట్రాకర్ ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది.
ఇద్దరి దారులు వేరు...
సచిన్ బన్సల్ ఒక ఆర్థిక సేవల సంస్థ నవి లో భారీ పెట్టుబడి పెట్టగా... బిన్నీ బన్సల్ ఎక్స్ టూ 10 ఎక్స్ తో పాటు సాయికిరణ్ కృష్ణమూర్తి తో కలిసి 021 కాపిటల్ అనే ప్రైవేట్ ఈక్విటీ సంస్థను స్థాపించారు. నవి లో సచిన్ రూ 3,900 కోట్ల భారీ పెట్టుబడి పెట్టగా... బిన్నీ మాత్రం తన సంస్థలను సింగపూర్ కేంద్రంగా ఆపరేట్ చేస్తున్నారు.
దీంతో ఇద్దరు దారులు వేరు అయిపోయాయి. అందుకే, ఇక కలిసి పనిచేయ గలిగే అవకాశం లేదని నిర్ధారించుకున్నతర్వాతే వారు సబీన్ అడ్వైసర్స్ ను మూసివేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా... సచిన్ కొంత ముందుగానే ఫ్లిప్కార్ట్ నుంచి వైదొలిగి స్టార్టుప్ కంపెనీల్లో పెట్టుబడులపై ఫోకస్ పెట్టారు. కానీ బిన్నీ మాత్రం ఇప్పటికీ ఫ్లిప్కార్ట్ లో సుమారు 3.25% వాటాను కొనసాగిస్తున్నారు. దాని విలువ ప్రస్తుతం సుమారు 732 మిలియన్ డాలర్లు (దాదాపు రూ 5,475 కోట్లు) ఉంటుంది.
వాటికి సేవలు...
సచిన్ బన్సల్ ప్రముఖ రైడ్ హైలింగ్ కంపెనీ ఓలా లో సుమారు 100 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టారు. ఓగో, బౌన్స్, క్రేజీ బీ అనే సంస్థల్లోనూ ఫండ్స్ ఇన్వెస్ట్ చేశారు. అదే సమయంలో మరిన్ని స్టార్టుప్ కంపెనీల్లోనూ పెట్టుబడులు పెట్టారు. ఇదిలా ఉండగా... బిన్నీ బన్సల్ ప్రస్తుతం గ్రోత్ పేజ్ లో ఉన్న పలు స్టార్టుప్ కంపెనీలకు మెంటోర్షిప్ సర్వీసెస్ అందిస్తున్నారు. ఇందులో రాపిడో, డాంజో, బౌన్స్ వంటి కంపెనీలు ఉన్నాయి.
అలాగే ఎలక్ట్రిక్ బైకుల కంపెనీ అథెర్ ఎనర్జీ, జనరల్ ఇన్సూరెన్స్ సేవల కంపెనీ అక్కో, టెర్రా వ్యూ, మొబీకాన్, క్రయో వంటి స్టార్టుప్ కంపెనీల్లో పెట్టుబడి కూడా పెట్టారు. సో, ఇలా ఎవరికి వారు వారి సొంత ఇన్వెస్ట్మెంట్లు, మెంటార్షిప్ తో బిజీ గా ఉండటంతో సంయుక్తంగా ఒక కంపెనీ ఆధ్వర్యంలో పనిచేసే అవకాశం లభించటం లేదని సబీన్ అడ్వైసర్స్ కు స్వస్థి పలకాలని సచిన్, బిన్నీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.