ఇప్పటికే లక్ష్యం తప్పింది, కఠిన చర్యలను సమర్థించను: బడ్జెట్పై అభిజిత్ బెనర్జీ
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. ఆర్థిక మందగమనం నేపథ్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం బడ్జెట్ 2020-21పై అందరూ ప్రత్యేక దృష్టిసారించారు. రాబోయే బడ్జెట్ పైన నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ స్పందించారు. ఆర్థిక లోటు ఇప్పటికే భారీగా ఉందని, ఇలాంటి సమయంలో ఆర్థిక కఠినతర మార్గాన్ని అనుసరించడం శ్రేయస్కర, తెలివైన పని కాదన్నారు.
పెట్రోల్ ధరల పెరుగుదలపై ఊరట, 10 రోజుల్లో ఎంత పెరిగిందంటే?
కఠిన చర్యలను సమర్థించను
ద్రవ్యలోటు కట్టడిని మరింత బిగించడాన్ని తాను సమర్థించనని అభిజిత్ బెనర్జీ స్పష్టం చేశారు. కేంద్రం విద్యపై నిధుల కేటాయింపును తగ్గించడం పెద్దగా ప్రభావం చూపదని చెప్పారు. ద్రవ్యలోటు లక్ష్యం ఇప్పటికే కట్టు తప్పిందని, అది పెద్ద విషయమని తాను అనుకోడవం లేదన్నారు. కానీ ఇప్పటికైతే ద్రవ్యలోటు కట్టడి కోసం కఠిన చర్యలు తీసుకోవడాన్ని సమర్థించనని వ్యాఖ్యానించారు. కాగా, పన్నులను పెంచడం ద్వారా న్యాయ్ స్కీంను అమలు చేయాలని 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి సూచించింది అభిజిత్ బెనర్జీయే కావడం గమనార్హం.
అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం
వాస్తవానికి విద్య రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కావడంతో కేంద్ర ప్రభుత్వం నిధులను పెద్దగా కేటాయించదని అభిజిత్ చెప్పారు. ప్రస్తుతం కేంద్రం విద్యపై రూ.3,000 కోట్ల మేరకు కోత విధిస్తే, అది పెద్దగా ప్రభావం చూపుతుందని తాను భావించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులతో పోలిస్తే ఇది సముద్రంలో నోటి బొట్టుతో సమానమన్నారు.
పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి
మనకు ఉన్న వనరులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అభిజిత్ బెనర్జీ అన్నారు. ప్రపంచంలోనే అత్యధిక వేతనాలు పొందుతున్న వారిలో అతి కొద్ది దేసాల ఉపాధ్యాయుల్లో భారతీయులు ఉన్నారని చెప్పారు. దీంతో వారు మెరుగ్గా బోధించాల్సిన అవసరముందన్నారు. నవంబర్ నాటికే ద్రవ్యలోటు బడ్జెట్ అంచనాల కంటే 114.8 శాతం పెరిగి రూ.8.07 లక్షల కోట్లకు చేరుకున్న విషయం తెలిసిందే.