వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీ.. న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొనబోతోంది. తోటి ఉద్యోగినిపై అభ్యంతరకరంగా, అసభ్యకరంగా కామెంట్స్ చేసిన ఆంటోనియో గార్సియా మార్టినెజ్ తొలగింపు వ్యవహారం మరింత ముదిరింది. తనను తొలగించడాన్ని న్యాయస్థానంలో అప్పీల్ చేస్తానని ఆయన వెల్లడించారు. యాపిల్ కంపెనీ యాజమాన్యంపై పరువునష్టం దావా వేస్తానని పేర్కొన్నాడు. మహిళలపై తన రాతలు, భావాలు ఎలా ఉంటాయనే విషయం యాపిల్ మేనేజ్మెంట్కు ముందే తెలుసునని, అయినప్పటికీ.. తనను తొలగించడం సరికాదని పేర్కొన్నారు.
ఆంటోనియో గార్సియా మార్టినెజ్.. రెండు నెలల కిందటే యాపిల్లో చేరారు. ఇదివరకు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్లో సుదీర్ఘకాలం పాటు పనిచేసిన ఆయన ఆకర్షణియమైన ప్యాకేజీతో అడ్వర్టయిజ్మెంట్ బిజినెస్ మేనేజర్ హోదాలో యాపిల్లో జాయిన్ అయ్యారు. ఇటీవలే తన తోటి మహిళా ఉద్యోగిని గురించి అసభ్యకరమైన కామెంట్స్ చేశారు. వాటిని తన డెయిలీ ఎంగేజ్మెంట్ బుక్లో రాసుకొచ్చాడు. అది కాస్తా బయటికి పొక్కింది. తోటి ఉద్యోగులు ఆంటోనియోపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయనను తొలగించాలంటూ రూపొందించిన వినతిపత్రంపై సుమారు రెండువేల మంది ఉద్యోగులు సంతకాలు చేశారు.

వారి అభ్యర్థన మేరకు యాపిల్ మేనేజ్మెంట్.. ఆంటోనియోను తొలగించింది. ఈ మేరకు ఈ నెల 12వ తదేీన ఓ సర్కులర్ను జారీ చేసింది. మూడురోజుల తరువాత దీనిపై ఆంటోనియో స్పందించారు. తన మౌనాన్ని వీడారు. మహిళలపై తన భావజాలం ఎలా ఉంటుందో.. తన రాతలు ఎలా ఉంటాయోననే విషయం యాపిల్ మేనేజ్మెంట్కు తెలుసునని చెప్పుకొచ్చారు. తాను జాయిన్ కావడానికి ముందే తన వైఖరిని మేనేజ్మెంట్కు వెల్లడించానని, అయినప్పటికీ.. తన పనితీరును చూసి, కంపెనీలో చేర్చుకున్నారని వివరించారు. దీనిపై ఆయన వరుస ట్వీట్లు పెట్టారు. అన్నీ తెలిసిన తరువాత కూడా తనను తొలగించడాన్ని పరువునష్టంగా భావిస్తున్నానని చెప్పారు.


Click it and Unblock the Notifications