జూన్ 1వ తేదీ నుండి మార్పులు ఇవే, మీపై ప్రభావం చూపవచ్చు
సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీ నుండి బ్యాంకింగ్, గ్యాస్ సిలిండర్ ధరలు సహా వివిధ ఛార్జీల్లో మార్పులు, చేర్పులు ఉంటాయి. ఇందులో భాగంగా జూన్ 1వ తేదీ నుండి పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. బ్యాంకుల హోమ్ లోన్ వడ్డ రేట్ల నుండి థర్ట్ పార్టీ ఇన్సురెన్స్ ప్రీమియం వరకు పలు మార్పులు ఉంటున్నాయి. ఇందులో కొన్ని వినియోగదారులపై భారం పడనుంది. అదే సమయంలో ఫిక్స్డ్ డిపాజిట్ల పైన వడ్డీ రేట్ల పెంపు ద్వారా కస్టమర్లకు ప్రయోజనం చేకూరనుంది.
బ్యాంకు ఛార్జీలు, వడ్డీ రేటు
ఆర్బీఐ ఈ నెల ప్రారంభంలో రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ నేపథ్యంలో వివిధ బ్యాంకులు హోమ్ లోన్ నుండి పర్సనల్ లోన్ వరకు వడ్డీ రేట్లను సవరిస్తున్నాయి. ఇది వినియోగదారులకు భారంగా మారుతోంది. ఎస్బీఐ సహా వివిధ బ్యాంకులు తమ హోమ్ లోన్ ఈబీఎల్ఆర్ను పెంచుతున్నాయి. ఎస్బీఐ హోమ్ లోన్ వడ్డీ రేటును 6.65 శాతం నుండి 7.05 శాతానికి పెంచింది. ఇది జూన్ 1 నుండి అమల్లోకి వస్తోంది.
యాక్సిస్ బ్యాంకు సేవింగ్స్, శాలరీ ఖాతా సర్వీస్ ఛార్జీలను పెంచుతోంది. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లోని ఖాతాదారులు నెలవారీగా నిర్వహించాల్సిన సగటు బ్యారెన్స్ రూ.15వేల నుండి రూ.25 వేలకు పెంచింది. లేదా రూ.1 లక్ష టర్మ్ డిపాజిట్ చేయాలి. మినిమం బ్యాలెన్స్ పాటించకుంటే పెనాల్టీ రూ.7.50 విధిస్తుంది. ఇది కూడా జూన్ 1వ తేదీ నుండి అమల్లోకి వస్తోంది.
థర్డ్ పార్టీ ప్రీమియం
వాహనాల థర్డ్ పార్టీ మోటార్ ఇన్సురెన్స్ ప్రీమియం జూన్ 1వ తేదీ నుండి పెరుగుతోంది.
నోటిఫికేషన్ ప్రకారం సవరించిన థర్డ్ పార్టీ బీమా ప్రీమియం ధరలు ఇలా ఉన్నాయి. 1000 సీసీ ఇంజిన్ సామర్థ్యం కలిగిన ప్రయివేటు కార్ల ప్రీమియంను రూ.2072 నుండి రూ.2094కు, 1000 సీసీ నుండి 1500 సీసీ వరకు ఇంజిన్ సామర్థ్యం కలిగిన ప్రయివేటు కార్ల బీమా ప్రీమియం రూ.3221 నుండి రూ.3416కు పెంచారు. కానీ 1500 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం కలిగిన కార్ల ప్రీమియంను రూ.7897 నుండి రూ.7890కి తగ్గించారు.
150 సీసీ నుండి 350 సీసీ వరకు ఉండే బైక్స్ బీమా ప్రీమియం ఇక నుండి రూ.1366కు పెరుగుతుంది. 350 సీసీ కంటే అధిక సామర్థ్యం కలిగిన బైక్స్ ప్రీమియం రూ.2804కు, 30 కిలో వాట్ల కంటే తక్కువ ఉండే ఎలక్ట్రిక్ కార్ల ప్రీమియం రూ.178, 30 నుండి 65 కిలో వాట్ల మధ్య ఉండే విద్యుత్ కార్ల ప్రీమయం రూ.2904కు చేరుకుంది.
1200 కిలోల నుండి 20 వేల కిలోల సామర్థ్యం కలిగిన కమర్షియల్ వెహికిల్స్ థర్డ్ పార్టీ బీమా ప్రీమియం రూ.33,414 నుండి రూ.35,313కు, 40వేల కిలోల కంటే అధిక సామర్థ్యం కలిగిన కమర్షియల్ వెహికిల్ ప్రీమియం రూ.41,561 నుండి రూ.44,242కు పెరిగింది. స్కూల్స్ వినియోగించే బస్సుల ప్రీమియంపై 15 శాతం డిస్కౌంట్, హైబ్రీడ్ ఎలక్ట్రిక్ వాహనాలపై రూ.7.5 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఇండియా పోస్ట్... చార్జీలు
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ఆధార్ ఎనెబుల్ పేమెంట్ సిస్టమ్ సర్వీస్ ఛార్జీలను ప్రవేశ పెట్టింది. ఈ ట్రాన్సాక్షన్ చేసేవారు ఛార్జలు చెల్లించాలి. కొత్త ఛార్జీలు జూన్ 15వ తేదీ నుండి అమల్లోకి వస్తాయి. నగదు ఉపసంహరణ, డిపాజిట్, మినీ స్టేట్ మెంట్ వంటి వాటికి ఛార్జీలు వర్తిస్తాయి.
గోల్డ్ హాల్ మార్క్
జూన్ 1వ తేదీ నుండి గోల్డ్ హాల్ మార్కింగ్ తప్పనిసరి. 14 క్యారెట్లు, 18 క్యారెట్లు, 20 క్యారెట్లు, 22 క్యారెట్లు, 23 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారంపై హాల్ మార్కింగ్ ఉంటోంది. 21 క్యారెట్లు లేదా 19 క్యారెట్ల బంగారం ఆభరణాలకు ఇప్పటి వరకు హాల్ మార్కింగ్ లేదు. అయితే జూన్ ఒకటవ తేదీ నుండి నిబంధనలు మారుతున్నాయి.