GST: ముగిసిన GST కౌన్సిల్ సమావేశం.. పన్నులు తగ్గనున్నది వీటిపైనే
GST: GST కౌన్సిల్ 49వ సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు. అందులో తీసుకున్న నిర్ణయాల గురించి వెల్లడించారు. రాష్ట్రాలకు చెల్లించాల్సిన GST పరిహారం సహా వివిధ వస్తువులపై పన్నులు తగ్గించినట్లు చెప్పారు. మంత్రుల బృందం రూపొందించిన నివేదికను కౌన్సిల్ ఆమెదించినట్లు స్పష్టం చేశారు.
AG సర్టిఫికెట్ సమర్పిస్తేనే..
జూన్ 2022కి రాష్ట్రాలకు చెల్లించాల్సిన రూ.16,982 కోట్ల GST పరిహారం సెస్ ను.. త్వరలోనే క్లియర్ చేయనున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అకౌంటెంట్ జనరల్(AG) సర్టిఫికెట్ ను సమర్పించిన 6 రాష్ట్రాలకు రూ.16,524 కోట్ల మొత్తాన్ని విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. ఢిల్లీ, తమిళనాడు, తెలంగాణలు ఇప్పటికే వాటిని పంపించినట్లు చెప్పారు. రాష్ట్రాలు GST పరిహారం పొందేందుకు AG సర్టిఫికేట్ సమర్పించడం తప్పనిసరి కానప్పటికీ, 90 శాతం నిధులు విడుదల చేశామన్నారు. అవి పంపించిన తర్వాతే మిగిలిన మొత్తం ఇవ్వబడుతుందని పేర్కొన్నారు.
మంత్రుల నివేదికకు ఆమోదం:
అప్పిలేట్ ట్రిబ్యునళ్ల ఏర్పాటు, పాన్ మసాలా, గుట్కా వ్యాపారాల్లో పన్ను ఎగవేతలను అరికట్టడంపై విజ్ఞాన్ భవన్లో జరిగిన GST కౌన్సిల్ సమావేశంలో చర్చించినట్లు మంత్రి తెలిపారు. పాన్ మసాలా మీద పన్ను విధింపుపై మంత్రుల బృందం (GoM) నివేదికను కౌన్సిల్ ఆమోదించినట్లు వెల్లడించారు. పెన్సిల్ షార్పనర్లు, కొన్ని ట్రాకింగ్ పరికరాలపై GSTని తగ్గించాలని కౌన్సిల్ నిర్ణయించినట్లు చెప్పారు. లూజు బెల్లంపై ఇప్పటి వరకు ఉన్న 18 శాతం పన్ను మొత్తాన్ని ఎత్తివేశారు. ప్యాక్ చేయబడి, లేబుల్ ఉంటే 5 శాతం పన్ను విధించనున్నట్లు పేర్కొన్నారు.
ఆర్థిక బిల్లులో చేరుస్తాం:
"వార్షిక రిటర్నులను ఆలస్యంగా దాఖలు చేసినందుకు వసూలు చేస్తున్న రుసుమును హేతుబద్ధీకరించాలని GST కౌన్సిల్ సిఫార్సు చేసింది. SUVలు, MUVల ఫిట్ మెంట్ పై కమిటీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కోర్టులు, ట్రిబ్యునల్స్ అందించే సేవలపై రివర్స్ ఛార్జ్ మెకానిజం కింద పన్ను విధించాలని భావించింది. GST అప్పిలేట్ ట్రిబ్యునల్ డ్రాఫ్ట్ లో సవరణలను వారంలోగా సర్క్యులేట్ చేస్తాం" అని మంత్రి తెలియజేశారు. మార్చి 1 నాటికి పూర్తిగా సిద్ధం చేసి ఆర్థిక బిల్లులో చేరుస్తామన్నారు.