తొలి అర్ధ సంవత్సరంలో FDIల జోరు, 6 నెలల్లో రూ.2.22 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ సంవత్సరం(H1)లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FPI) 15శాతం పెరిగాయి. ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో గత ఏడాదితో పోలిస్తే ఈ పెట్టుబడులు పెద్ద ఎత్తున పెరిగాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ కాలంలో దేశంలోకి 30 బిలియన్ డాలర్లు (2.22 లక్షల కోట్లు) విదేశీ పెట్టుబడులు వచ్చాయి.
2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో 26 బిలియన్ డాలర్లుగా నమోదయింది. ఇందులో ఎక్కువగా పెట్టుబడులు మారిషస్(29 శాతం), సింగపూర్ (21 శాతం) నుండి వచ్చాయి. ఆ తర్వాత సంస్థానంలో అమెరికా, నెదర్లాండ్స్, జపాన్ 7 శాతం అంతకంటే ఎక్కువగా ఉన్నాయి. FDIలు భారత్కు పెరగడంతో మారిషస్ నాలుగో స్థానానికి చేరింది.
పుంజుకుంటున్న ఎకానమీ, Q2లో 7.5 శాతం క్షీణత: టెక్నికల్గా ఆర్థిక సంక్షోభంలో భారత్..
ముఖేష్ అంబానీ ఎఫెక్ట్
ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్లోకి పెద్ద మొత్తంలో పెట్టుబడులు వచ్చిన విషయం తెలిసిందే. విదేశీ పెట్టుబడులు పెద్ద మొత్తంలో పుంజుకోవడానికి కారణం ముఖేష్ అంబానీ కంపెనీల్లోకి వచ్చిన పెట్టుబడులు దోహదపడ్డాయని చెబుతున్నారు.
DPIIT గణాంకాల ప్రకారం రంగాలవారీగా చూస్తే టాప్ 10లో 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో సాఫ్టువేర్, హార్డ్వేర్ రంగాలు ముందున్నాయి. మిగతా 9 రంగాల్లో పెట్టుబడులు తగ్గాయి.
రాష్ట్రాలవారీగా చూస్తే గుజరాత్కు సగానికి పైగా FDIలు వచ్చాయి. ఈ రాష్ట్రానికి 16 బిలియన్ డాలర్లు వచ్చాయి. ఆ తర్వాత మహారాష్ట్ర ఉండగా, మూడో స్థానంలో కర్ణాటక ఉంది.
రంగాలవారీగా..
ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో సర్వీసుల రంగానికి 17 శాతం పెట్టుబడులు వచ్చాయి. సర్వీసుల రంగంలో ఫైనాన్షియల్, బ్యాంకింగ్, బీమా, ఔట్ సోర్సింగ్ కలసి ఉన్నాయి. ఈ రంగాల్లో కంప్యూటర్ సాఫ్టువేర్, హార్డువేర్ విభాగానికి 12 శాతం FDIలు వచ్చాయి. టెలికం రంగానికి 7 శాతం వచ్చింది. మహారాష్ట్ర 20 శాతం, కర్ణాటక 15 శాతం, ఢిల్లీ 12 శాతం చొప్పున FDIలు వచ్చాయి.
కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పలు దేశాల ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించి లిక్విడిటీని పెంచాయి. ఇదే సమయంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. దీంతో భారత్కు విదేశీ పెట్టుబడులు పెరుగుతూ వచ్చాయి. కాంట్రాక్ట్ మ్యాన్యుఫాక్చరింగ్, కోల్ మైనింగ్ తదితర రంగాలు భవిష్యత్తులో మరిన్ని విదేశీ పెట్టుబడుల్ని ఆకట్టుకునే వీలుంది.
అందుకే పెరిగాయి
దేశంలో FPIలకు అనువైన వాతావరణం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. జూలై-సెప్టెంబర్ కాలంలో 28.1 బిలియన్ డాలర్లకు FDIలు పెరిగాయని, మోడీపై నమ్మకం వల్ల FDIలు వెల్లువెత్తుతున్నాయని, అంతర్జాతీయ పెట్టుబడిదారులు భారత్ను గమ్యస్థానంగా ఎంచుకుంటున్నారన్నారు. కరోనా ఉన్నప్పటికి FDIలు భారీగా పెరిగాయన్నారు.